30/05/2026
తమ హయాంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించలేని అసమర్థులు, ఇప్పుడు శాస్త్రీయం గా జరుగుతున్న నియామక ప్రక్రియ పై ప్రజల్లో అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఎంతో పకడ్బందీగా చేపట్టిన 'స్పోర్ట్స్ డీఎస్సీ-2025' నియామక ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే విధంగా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. వాటి ఆధారంగా తప్పుడు వార్తలు రాసి తమ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. 'స్పోర్ట్స్ డీఎస్సీ-2025' నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించబడింది. క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం శాప్కు లేదు. అవి కేవలం సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా మాత్రమే జారీ చేయబడతాయి. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్ను, అది జారీ చేసిన సంస్థకు పంపి, అధికారికంగా జెన్యూనిటీ ధృవీకరించిన తర్వాతే మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ధృవీకరణ లేని ఏ సర్టిఫికెట్ను ఎంపిక ప్రక్రియలో ఉపయోగించలేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై 25.07.2025న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు FIR No.75/2025 (BNS సెక్షన్ 319(2), IT Act సెక్షన్ 66-D) నమోదు చేశారు. స్థానిక/స్థానికేతర స్థితికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. క్రీడా మెరిట్ ధృవీకరణ మాత్రమే శాప్ పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లు, రోస్టర్ అమలు మరియు పోస్టుల కేటాయింపులు పూర్తిగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం జరిగాయి. స్పోర్ట్స్ డీఎస్సీ-2025, శాప్, విద్యా శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తులు, మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు సహా కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. స్పోర్ట్స్ డీఎస్సీ-2025 పై తప్పుడు వార్తల్ని ఎవరూ నమ్మవద్దు.