11/08/2026
పత్రికా ప్రచురణార్థం
ప్రభుత్వ భూములను కాపాడాలని ఆర్డీవోకు సిపిఎం ప్రతినిధి బృందం వినతి
షాపల్లిలో 135 సర్వే నెంబరులో 2-24 ఎకరాల ఇనాం భూమి కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అక్రమ పట్టా రద్దు చేయాలి
అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం
– సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు
, ఆగస్టు 11: స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ పరిధిలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆక్రమించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని, ప్రభుత్వ భూములను తక్షణమే రక్షించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ జఫర్గడ్ మండలం
షాపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 135 విస్తీర్ణం 2-24 రెండెకరాల ఇరువై నాలుగు గంటలు ప్రభుత్వ ఇనాం భూమిని ఇదే గ్రామానికి చెందిన మాదిరెడ్డి రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని అతని పట్టాను రద్దు చేయాలని కోరారు
స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ పరిధిలో దేవాదాయ, ప్రభుత్వ, పంచరాయి, పోరంబోకు, చెరువు శికం తదితర వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి సర్వే నిర్వహించాలని, సరిహద్దులు నిర్ణయించి శాశ్వత సరిహద్దు రాళ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఎం ఆధ్వర్యంలో అన్యాక్రాంత ప్రభుత్వ భూములపై గ్రామాల వారీగా సర్వే నిర్వహించి వివరాలను సేకరిస్తున్నామని, ఇప్పటికే పలు గ్రామాల నుంచి ఆక్రమణల వివరాలు పార్టీ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా కొలతలు వేయించి, హద్దులు నిర్ణయించి, ప్రభుత్వ ఆస్తి అని స్పష్టంగా తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే భూమిలేని నిరుపేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు లేని పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టకపోతే, సిపిఎం ఆధ్వర్యంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి, ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసి భూ పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలను సమీకరించి విస్తృత స్థాయి భూ పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మునిగేల రమేష్ పార్టీ మండల నాయకులు మంద మహేందర్ చిలుముల్ల భాస్కర్ కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ తాళ్లపల్లి నరేష్ ఏడేల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు