24/07/2026
ప్రజల జీవనాధారంపై డంపింగ్ యార్డు దాడి
సిద్ధాపూర్ జీవో 641ను రద్దు చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేవైఎం నేతలు వినతి
కొత్తూరు, జూలై 24 (ప్రభాతవార్త):
సిద్ధాపూర్లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు సంబంధించిన జీవో నంబర్ 641ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బీజేవైఎం కొత్తూరు మండల అధ్యక్షుడు అంబటి శ్రీశైలం ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు వినతిపత్రం అందజేశారు.
సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ప్రజల జీవనాధారం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, వ్యవసాయం, పశుపోషణపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వం సిద్ధాపూర్ ప్రాంతంలోని భూములను ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించగా, ప్రస్తుతం డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం జీవో జారీ చేయడం సరికాదన్నారు. ప్రతిపాదిత ప్రాంతంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో గొట్ట చెరువు ఉందని, ఈ చెరువుపైనే స్థానిక ప్రజల వ్యవసాయం, పశుపోషణ ఆధారపడి ఉందని తెలిపారు. డంపింగ్ యార్డు ప్రతిపాదిత స్థలానికి సుమారు 50 గ్రామాలు సమీపంలో ఉన్నందున ప్రజల ఆరోగ్యాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, జీవో నంబర్ 641 రద్దు కోసం ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును అంబటి శ్రీశైలం, మంగలి రమేష్ తోపాటు పలువురు బిజెపి సీనియర్ నాయకులు కోరారు.