31/05/2026
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ శ్రీ సి.వి.ఆనంద్, ఐపీఎస్ డీజీపీ పరిధిలోని అన్ని విభాగాల ఎస్ఐ మరియు అంతకంటే పై స్థాయి అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 6,500 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వానికున్న అభిప్రాయాలుమరియు రాష్ట్ర పోలీసు శాఖపై ఉన్న అంచనాల గురించి ప్రారంభోపన్యాసం చేసిన అనంతరం, గతంలో మావోయిస్టు సమస్యలు మరియు సాధారణ నేరాల నియంత్రణ నుంచి ప్రస్తుతం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నార్కోటిక్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు వంటి కొత్త సవాళ్ల దిశగా పోలీస్ శాఖ దృష్టి మళ్లాల్సిన అవసరాన్ని డీజీపీ వివరించారు. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారుల ఆలోచనా విధానం, పనితీరు కూడా మారాలని సూచించారు.
ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక విభాగం, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకునేలా టెక్ టీమ్ బృందం, ఆదాయ నష్టాలను అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్, అలాగే తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక యాంటీ ఫుడ్ అడల్టరేషన్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా ఎస్పీలు మరియు పోలీస్ కమిషనర్లు తమ యూనిట్లకు నాయకులుగా వ్యవహరించాల్సిన బాధ్యతలను ఆయన వివరించారు. నేర సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పోలీస్ స్టేషన్లు మరియు ఇతర యూనిట్లను క్రమం తప్పకుండా సందర్శించి తనిఖీలు చేయడం, రాత్రి గస్తీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం, డయల్ 112 కాల్స్కు వేగవంతంగా స్పందించడం వంటి ప్రాథమిక పోలీసింగ్ విధానాలపై దృష్టి సారించాలని సూచించారు.
సమాజ పోలీసింగ్లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గం నుంచి సాయంత్రం 5 గం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అధికారులను కలిసేలా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆదేశించారు.
తమ యూనిట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తూ అత్యున్నత స్థాయి నిజాయితీ, పారదర్శకత మరియు నైతిక విలువలను కాపాడాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. సమగ్రత (Integrity) లేకపోతే చేసే కృషి ఫలప్రదం కాదని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ విజయాపజయాలను నిర్ణయించే కీలక పాత్రధారులు SHO లని పేర్కొంటూ, వారి విధులు, బాధ్యతలను విపులంగా వివరించారు. అలాగే SHOలు కాని ఎస్ఐలు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు వంటి పర్యవేక్షణ అధికారుల బాధ్యతల గురించి కూడా వివరించారు.
రాష్ట్ర పోలీసు బలగమంతటికీ ఒకేసారి తన ఆలోచనలు, లక్ష్యాలు మరియు దిశానిర్దేశాన్ని చేరవేయగలిగినందుకు ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిన సమావేశమని డీజీపీ పేర్కొన్నారు.