27/05/2025
సినిమా హాళ్ల నిర్వహణలో పకడ్బందీ – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ల నిర్వహణ మరింత పకడ్బందీగా సాగాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. థియేటర్లలో టికెట్ ధరలతో పాటు తినుబండారాలు, శీతలపానీయాల ధరలపై నియంత్రణ అవసరమని ఆయన పేర్కొన్నారు. తక్కువ ధరల్లో మంచి సేవలు అందించగలిగితేనే ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాళ్లకు వస్తారని, అదే తరచుగా జరిగితే పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలో విడుదలయ్యే “హరిహర వీరమల్లు” వంటి చిత్రాలకు సైతం టికెట్ ధరలు పెంచాలంటే వ్యక్తిగతంగా కాకుండా తప్పనిసరిగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. “నా సినిమా అయినా సరే నియమాలు అందరికీ సమానంగా ఉండాలి” అనే సందేశాన్ని ఈ ప్రకటన ద్వారా ఆయన ఇచ్చారు.
థియేటర్లలో విక్రయించే పాప్కార్న్, శీతలపానీయాలు, బాటిల్ నీటికి గల అధిక ధరలు, వాటి నాణ్యతపై పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార వ్యాపారంపై గుత్తాధిపత్యం నెలకొన్నట్టు సమాచారం రావడంతో, దీనిపై తగిన విచారణ చేయాలని సినిమాటోగ్రఫీ శాఖకు సూచించారు.
ఇక తాజాగా జరుగుతున్న సినిమా హాళ్ల బంద్ ప్రకటనల వెనుక ఉన్న నేపథ్యం పైనా మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. బంద్ వెనుక రాజకీయ నేతలు, నిర్మాతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తుండగా, ఈ విషయంపై సవివరంగా విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని సూచించారు. ఈ పరిణామాల్లో జనసేన నేతలు ఉన్నా చర్యలకు వెనుకాడొద్దని ఆయన స్పష్టం చేశారు.
అంతేగాక, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సమగ్ర సినిమా అభివృద్ధి విధానంపై (Comprehensive Film Development Policy) పరిశ్రమ నుంచి సూచనలు తీసుకోవాలని సూచించారు. సినిమా రంగాన్ని పారదర్శకంగా, ప్రజల మద్దతుతో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.