15/08/2026
విధ్వంసం కాదు.. నిర్మాణమే యువత లక్ష్యం కావాలి
• మహనీయుల త్యాగాల స్ఫూర్తితో.. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
• ప్రశ్నించే తత్వంతో... మార్పు కోసం నిర్మాణాత్మక పోరాటం చేయాలి
• డబ్బుకు ఓటును.. తప్పుడు సమాచారానికి ఆలోచనను అమ్ముకోవద్దు
• వేగంగా వచ్చే ప్రతి సమాచారం నిజం కాదు… ఆలోచించి, పరిశీలించి నిర్ణయం తీసుకోండి
• సామాన్యుడి నిత్య పోరాటమే.. దేశ నిర్మాణానికి బలమైన పునాది
• కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగం
• అడవితల్లి బాట తో గిరిజన గ్రామాలకు మహర్దశ
• రూ.2,078 కోట్లతో 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
• రూ.8 వేల కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ పనులకు వేగం
• రూ.9,355 కోట్లతో 6,500 గ్రామాలకు తాగునీటి సౌకర్యం
• శరవేగంగా పోలవరం పూర్తి.. అమరావతి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
• కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి... ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు
ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ప్రతి తరానికీ ఒక ప్రత్యేక బాధ్యత ఉందని, నేడు ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సింది యువతేనని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు. స్వేచ్ఛగా ఆలోచిస్తూ, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, మార్పు కోసం పోరాడాలని.. అయితే ఆ పోరాటాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మలచాలని యువతకు పిలుపునిచ్చారు. ‘డబ్బుకు మీ ఓటును అమ్ముకోకండి.. తప్పుడు సమాచారానికి మీ ఆలోచనను అమ్ముకోకండి.. ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి.. ప్రశ్నించే యువత కావాలి.. పరిష్కారాలు చూపే యువత కావాలి.. దేశాన్ని ముందుకు నడిపించే యువత కావాలి’ అని స్పష్టం చేశారు. మీరు పోరాడుతున్న సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ ఆ పోరాటాన్ని ఎవరు ఏ దిశలోకి తీసుకెళ్తున్నారు? దాని వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది? అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని ధ్వంసం చేయడం కాదు.. సరిచేయాలి, మార్పు కోసం చేసే పోరాటం ప్రజలకు నష్టం కలిగించకుండా, భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండాలని అన్నారు. శనివారం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “నేటి యువతతో మాట్లాడటం అంటే... రేపటి భారతదేశంతో మాట్లాడటమే. యువత కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు... భారతదేశ ప్రస్తుత బలం కూడా. ఈ రోజు సమాచారం మనకు క్షణాల్లో అందుతుంది. కానీ వేగంగా వచ్చే ప్రతిదీ నిజం కాదు. అందుకే ఏ విషయానైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, ఒక నిర్ణయానికి వచ్చే ముందు నిజానిజాలు పరిశీలించండి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A (h) ప్రకారం... ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనను, మానవత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, మార్పును కోరుకునే దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే హక్కు అందరికీ ఉంది. అదే మన బలం. కానీ, ఆ స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి వాడకూడదు.
*మీ శక్తి దేశ నిర్మాణానికి ఉపయోగించాలి*
ఒక విషయాన్ని పంచుకునే ముందు... అది నిజమో కాదో సరిచూసుకోండి. ఎవరినైనా విమర్శించే ముందు... వాస్తవాలు తెలుసుకోండి. నిందించే ముందు... ఒక పౌరుడిగా మీ బాధ్యతను గుర్తుంచుకోండి. బలమైన ప్రజాస్వామ్యానికి- గుడ్డిగా అనుసరించేవారు కాదు... నిజానిజాలు తెలిసిన బాధ్యతాయుతమైన పౌరులు అవసరం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు చిన్న వయసులోనే దేశం కోసం నిస్వార్థంగా పోరాడారు. యువతకు గట్టి సంకల్పం ఉంటే దేశ భవిష్యత్తును మార్చగలరని వారి జీవితాలు నిరూపించాయి. అదే స్ఫూర్తిని ఇప్పుడు దేశ నిర్మాణానికి ఉపయోగించాలి. భారతదేశానికి ప్రతిభకు కొదవ లేదు. మన యువతలో అపారమైన శక్తి ఉంది. కావాల్సిందల్లా వారికి సరైన అవకాశాలు. ఇప్పుడు ఆ అవకాశాలను సృష్టించాల్సిన సమయం వచ్చింది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి.. అంతరిక్ష రంగంలో మన విజయాల వరకు.. డిజిటల్ సామర్థ్యం నుంచి ప్రపంచ వేదికపై మన ప్రతిభను చాటుతున్న యువత వరకు.. భారతదేశం సామర్థ్యానికి ప్రపంచమే సాక్షిగా నిలుస్తోంది.
*దేశానికి అలాంటి యువత కావాలి*
ప్రశ్నించే యువత కావాలి. ప్రశ్నించడమే కాదు.. పరిష్కారాలు చూపే యువత కావాలి. ఉద్యోగాల కోసం ఎదురుచూడడమే కాదు.. అవకాశాలను సృష్టించే యువత కావాలి.
తమ కోసం మాత్రమే కాదు.. సమాజం కోసం ఆలోచించే యువత కావాలి.
దేశాన్ని విమర్శించడమే కాదు.. దేశాన్ని ముందుకు నడిపించే యువత కావాలి. ఈతరం చేతిలో ఉన్నది కేవలం ఒక జ్యోతి కాదు.. భారతదేశ భవిష్యత్తు. ఆ జ్యోతిని ఆరిపోనివ్వకండి. మీ ఆలోచనలతో, మీ ప్రతిభతో, మీ కష్టంతో, మీ నిజాయితీతో ఆ జ్యోతిని మరింత ప్రకాశవంతం చేయండి. మన చేతుల్లో ఉన్న ఈ వెలుగు.. మన తర్వాతి తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మారాలి. అదే మన బాధ్యత. అదే మన సంకల్పం. అదే మన స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం.
*ప్రతి సామాన్యుడి పోరాటం దేశ నిర్మాణంలో భాగమే*
ఈ ఏడాది మరో చారిత్రాత్మక సందర్భానికి మనం సాక్షులమవుతున్నాం. జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల కష్టాలు, త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్ర్యాన్ని కేవలం ఒక ఘట్టంగా గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు.. స్వాతంత్ర్యం మనకు కల్పించిన హక్కులతో పాటు, దేశం పట్ల మనకున్న బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తుచేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక కీలక వేదికగా నిలిచిందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. నాటి జాతీయోద్యమ స్ఫూర్తి నేటికీ మన చుట్టూ ఉన్న ప్రజల జీవన విధానంలో కనిపిస్తోంది.
తీర ప్రాంతంలో తుపాన్లు, సముద్ర కోత, భారీ వర్షాలు వంటి ప్రకృతి సవాళ్లు నిరంతరం ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు. రైతులు పొలాల్లోకి వెళ్తారు. నేత కళాకారులు మగ్గాల ముందు కూర్చుంటారు. కార్మికులు తమ పనుల్లో నిమగ్నమవుతారు. యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతుంది. కుటుంబాన్ని నిలబెట్టేందుకు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సామాన్యుడు ప్రతిరోజూ చేసే ఈ పోరాటం కూడా దేశ నిర్మాణంలో ఒక భాగమే.
*కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి పరుగులు*
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన బలమైన పాత్రను పోషిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి, వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సమష్టి కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటా నిధులను విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్కు రూ.4,597 కోట్లు అందాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇదే విధమైన సమన్వయం కొనసాగితే రాష్ట్ర ప్రగతికి మరింత వేగం చేకూరుతుంది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతులు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మరింత బలంగా ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది.
*గిరిజన గ్రామాలకు రహదారులు.. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు*
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రహదారి సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో... డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం ‘అడవితల్లి బాట’ కార్యక్రమం కింద రూ.2,078 కోట్లతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జల్ జీవన్ మిషన్- అమరజీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేశాం. అలాగే రూ.8 వేల కోట్లతో 1.30 కోట్ల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేశాం. మరో రూ.9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా 6,500 గ్రామాలకు తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్ల పనుల ప్రక్రియ ప్రారంభించాము.
*అడవుల రక్షణ నుంచి రైతు సంక్షేమం వరకు*
అటవీ, పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ విధానం, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం 10 కోట్ల దేశవాళీ మొక్కలను పెంచే ప్రణాళికతో పాటు, 74 నగర వనాలను అభివృద్ధి చేశాం. అలాగే దాదాపు 3 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి, వాటి విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2 వేల హెక్టార్లలో మడ అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో రెండో స్థానాన్ని సాధించాం. ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ద్వారా తీర ప్రాంతాల రక్షణకు కూడా చర్యలు చేపట్టాం. మానవ–వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించేందుకు హనుమాన్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి, 100కు పైగా వాహనాలతో అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేశాం. కుంకీ ఏనుగుల ద్వారా 15కు పైగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ, దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, 242 కేసులు నమోదు చేసి, 494 మందిని అరెస్టు చేశాం. కేసుల్లో 95 శాతం కన్విక్షన్ రేటు సాధించాం. అటవీ భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని 10,506 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాం. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.3,125 కోట్లతో, ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేలు సాగు సాయం అందిస్తున్నాం.
*10 వేల కిలోమీటర్ల డొంక రోడ్ల నిర్మిస్తున్నాం*
ఆహార, పౌరసరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాం. గత ఖరీఫ్ సీజన్లో 1.82 లక్షల మంది రైతుల నుంచి 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రూ.11,556 కోట్లను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశాం. రబీ సీజన్లో మరో రూ.6,037 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాం. గతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల ద్వారా రైతుల నుంచి సెస్ వసూలు చేసినా, ఆ నిధులను డొంక రోడ్ల నిర్మాణానికి గతంలో వినియోగించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా 10 వేల కిలోమీటర్ల డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. అలాగే, నేతన్న భరోసా ద్వారా చేనేత కార్మికులకు, మత్స్యకార సేవలో పథకం ద్వారా మన మత్స్యకారులకు అండగా నిలుస్తున్నాం. సంక్షేమం ద్వారా ప్రజలకు ఈ రోజు భరోసా కల్పిస్తున్నాం... అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలను నిర్మిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నాం.
*రూ. 1000 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు*
అలాగే, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం... దాదాపు రూ.1,000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను చేపట్టాం. ఇందులో ఉప్పాడ తీర రక్షణ గోడ, రోడ్లు–డ్రైన్లు, తాగునీటి వసతులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, 100 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, నగరవనం, చెరువుల పునరుద్ధరణ వంటి కీలక పనులు ఉన్నాయి. పల్లెపండుగ, వీబీ జీ రామ్ జీ వంటి కార్యక్రమాలతో పిఠాపురం అభివృద్ధికి మరింత వేగం తీసుకొచ్చాం” అన్నారు.