13/08/2026
- *కాలేజీలు ఫైర్ నిబంధనలు పాటించకున్న NOC లు-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం:*
- *ఫైర్ నిబంధనలు ప్రకారం ఏ కాలేజీలకు ఉన్నాయో బయటపెట్టాలి.*
- *ఫైర్ అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, వారి ఆస్తులపై నిఘా పెట్టాలి.*
— ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్
- *కరీంనగర్ DIEO కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది.*
- *ఫైర్ ఆఫీసర్, DIEOలకు డబ్బులిస్తే చాలు.. ప్రైవేట్ కాలేజీల్లో నామమాత్రపు తనిఖీలతో NOCలు.*
- *వసూళ్ల పర్వానికి తెరలేపిన అధికారులపై ACBకి ఫిర్యాదు చేస్తాం.*
- కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రాణాలతో కాలేజ్ మేనేజ్మెంట్లు, విద్యాశాఖ, ఫైర్ అధికారులు చెలగాటమాడుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తనిఖీల పేరుతో ఫైర్ అధికారి, డీఈఓ మరియు యూనివర్సిటీ అధికారులు కాసుల వేట మొదలుపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వసతులు లేకున్నా, ఫైర్ సేఫ్టీ నిబంధనలను లేకున్నా ముడుపులు తీసుకుంటూ "అంతా సవ్యంగా ఉందంటూ" ప్రైవేట్ కాలేజీలకు అక్రమంగా ఫైర్ NOCలు, ఇతర సర్టిపికెట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క భవనం కోసం ఫైర్ సర్టిపికెట్ కావాలని దరఖాస్తూ పెట్టితే కనీసం తనిఖీలు చేయకుండానే డబ్బులు తీసుకొని ఫైర్ అధికారి ఎన్ వోసి లు ఇస్తున్నారని మండిపడ్డారు.
నామమాత్రపు తనిఖీలు – వెలుగులోకి వచ్చిన అక్రమాలు:
రాష్ట్రంలో ఈ ఏడాది 1,400 ప్రైవేటు కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో DIEOలు చేపట్టిన ఫిజికల్ వెరిఫికేషన్ నివేదికలను ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినయ్ నేతృత్వంలో పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని తెలిపారు.
ఖాళీ గదులను ల్యాబ్లుగా, లైబ్రరీలుగా చూపిస్తూ తప్పుడు నివేదికలు ఇచ్చారు.
కనీసం మరుగుదొడ్లు లేని కాలేజీలకు కూడా అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం ఘోరం.
మే నాటికే పూర్తికావాల్సిన అఫిలియేషన్ ప్రక్రియ, అధికారుల అవినీతి వల్లే ఆగస్టు వచ్చినా కొలిక్కి రాలేదు.
ఫైర్ సర్వీసెస్ అధికారి, DIEO ఆఫీసులోని ఓ వ్యక్తి కలిసి ఒక్కో కాలేజీ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఫైర్ NOC లు, ఇతర సర్టిపికెట్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ DIEO కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి గడిచిన 9 ఏళ్లుగా అక్కడే తిష్టవేసి, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారి "వసూల్ రాజా"గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫైర్ ఆఫీసర్, DIEO ఆఫీస్ అధికారులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు బండారి శేఖర్ స్పష్టం చేశారు.
ఇట్లు...
బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్.