19/02/2023
#బాలయోగీశ్వరుల దేవాలయం
( #ముమ్మిడివరం)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లాలో చాలా ప్రాచుర్యం కలిగిన #బాలయోగి అనే యోగి ఉండేవారు.
ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించారు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవారు.
తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవా రు. కొంతకాలం ప్రజలకు దర్శనం ఇవ్వడానికి బాలయోగీశ్వరులు నిరాకరించినా… క్రమేపీ భక్తులు, ప్రజల నుండి తీవ్ర వత్తిడి రావడంతో ప్రతీ ఏడాది #మహాశివరాత్రికి ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి 5 లక్షల పైగా భక్తులు వచ్చారు. పూర్వం రోజులలో, ఆయన గురించి ఎవ్వరో ఒకరు ఏదో ఒకటి కథలు కథలుగా చెప్పుకునేవారు.
👉వారి సోదరుడు చిన బాలయోగి వారు కూడా వారి అన్నగారి స్పూర్తితో గొప్ప తపస్సు చేశారు!
ఋషులు… ఏ అరణ్యాల్లోనో ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటారని వింటూ ఉంటాం! కానీ, సరిగ్గా 88 ఏళ్ల క్రితం ఒక సామాన్యుడు రుషియై జనావాసాల మధ్య తపస్సు చేశాడు. యోగమూ తపస్సూ ఉత్త ట్రాష్ అనుకునే అత్యాధునిక సాంకేతిక యుగంలో తన కఠోర తపోదీక్షతో యోగశక్తిని చాటి చూపించాడో మౌని. అయితే ఆయన ఏనాడూ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయలేదు, ప్రవచనాలనూ చెప్పలేదు. ఆయన #బాలయోగి. ఊరు పేరుతో ఈశ్వరత్వాన్ని జోడించుకున్న ముమ్మిడివరం బాలయోగీశ్వరులు.
1930 అక్టోబర్ 23న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో ఒక పేద కుటుంబంలో కటికదల గంగయ్య, రామమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు సుబ్బారావు. వంశపారం పర్యంగా వచ్చే గోపాలక (పశువులను కాసే) వృత్తిలో సుబ్బారావు అయిష్టంగానే చేరాడు. చదువుకునే అదృష్టం ఎటూ లేదు. ఎరుకనిచ్చే చదువు వేరే ఉందని గ్రహించిన సుబ్బారావు, తన 16వ ఏట 1946 మే 22న కృష్ణుడు, నారదుల ఫోటోతో సమీపంలోని కొబ్బరితోటలోకి వెళ్ళి తపస్సుకు కూర్చున్నాడు. తల్లిదండ్రులు వారించి తీసుకొచ్చారు.
ఇంటిదగ్గరా అదే బాట. ఇక లాభం లేదనుకుని ఇంటి ప్రాంగణంలోనే కొబ్బరాకులతో పందిరి కట్టారు. పదహారేళ్ల ప్రాయం వాడు కఠోర తపస్సా అని ఆనోట ఈనోట పాకి భక్తజనం పోటెత్తారు. ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ఊరు ఒక ముక్తిథామం అయిపోయింది. అలా రెండు సంవత్సరాల 8 నెలలు ఆయన కనువిప్పి లోకాన్ని చూసిందీ లేదు! పెదవి విప్పి సంభాషించిందీ లేదు! అందుబాటులో ఉన్న దేవుడని అందరూ పాదాల్ని స్మృశించి, చుట్టూ గుమ్మిగూడుతుంటే తపస్సుకు ఇది మార్గం కాదనుకుని ఆయన లోలోపలి గదుల్లోకి వెళ్లిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న మహర్షి ఈలి వాడపల్లి ఆయన్ని దర్శించి ఇతను బాలయోగి అన్నారు. అప్పటి వరకూ ప్రతిరోజూ దర్శనం ఇచ్చే బాలయోగి ఇక మీదట వద్దన్నారు. భక్తులు, నిర్వాహకులు కోరితే 16-2-1950 నాటి నుంచి మహాశివరాత్రి మరుసటి రోజు దర్శనానికి అనుగ్రహించారు. అప్పటి నుంచి తన అవతార పరిసమాప్తి అయిన 19.7.1985 వరకు బాలయోగి భక్తులకు ప్రతి ఏటా దర్శనం ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలోనే ఆయన తనేమిటో తన తపోశక్తి ఏమిటో అనేక నిదర్శనాల ద్వారా తెలియజేశారు.
అదలా ఉంచితే ఎవరైనా ఒక వ్యక్తి 40 ఏళ్ళపాటు నిరాహారంగా, స్వీకార విసర్జనలు లేకుండా వుండటం సాధ్యమా అని ప్రశ్నలు లేవనెత్తిన తరుణంలో బాలయోగి దానికి తార్కాణంగా నిలిచారు. సంప్రదాయమైన యోగవిద్యను వశపరచుకున్న బాలయోగి అష్టాంగ యోగం ద్వారా సమాధిలోకి వెళ్ళిపోయి ఆకలి దప్పులను విసర్జించారు. భారతీయ యోగ సంప్రదాయంలో ఆపాద మస్తకము విస్తరించిన కుండలినీ శక్తిని జాగృతం చేసి, వెన్నువెన్నంటి నడిచే శుషమ్నా నాడిద్వారా ప్రయాణించి మూలాధార, స్వాథిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరడాన్ని జీవైక్యంగా ప్రతిపాదించారు. బాలయోగీశ్వరులు దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఇంతచేసి బాలయోగి మాట్లాడకపోలేదు. అదికూడా యోగంలో ఉన్న ఒకటి రెండు సందర్భాల్లోనే. చివరికి ఆయన భక్తులు చెప్పమంటే ఆయన చెప్పింది ఇది....
"భగవంతుని ధ్యానించడానికి అరణ్యం వెళ్ళనవసరం లేదు. ప్రపంచము నందు ఒక్క సూర్యుడే ఇంత ప్రకాశముగా ఉన్నాడు. కోటాను కోట్ల సూర్యుల ప్రకాశము గల భగవంతుడు ఎంత ప్రకాశముగా నుండును. జీవాత్మ పరమాత్మ స్వరూపము. జీవాత్మను పంచభూతములు మాయలోనికి లాగుచుండును. తానెవ్వరో తెలుసుకుని, చంచలమైన మనస్సును కట్టిపెట్టగలిగితే తన ఆత్మే తన గురువగును!'' సామాజిక, కుల ఆంతరాలకు అతీతంగా సిద్ధ యోగమును సాధించి, ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది, సర్వ మానవులు దేవుని దృష్టి యందు ఒకటే అనే భావనను నిజం చేసి నిరూపించారు.
అయితే ఆయన జీవిత కాలంలోనే హేతువాదుల నుండి నాస్తికుల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ హేతువాది డాక్టర్ కోట్నీస్ ఈ వ్యవహారాన్ని తన కెమెరాలో బందిద్దామని వచ్చి తనే బాలయోగీస్వరుల తపోనిష్ఠకు బందీ అయిపోయిన విషయం యావద్భారతానికి పత్రికా ముఖంగా తెలియజేశారు.
దాదాపు నాలుగు దశాబ్దాల కాలం పాటు ఆంధ్రదేశ భక్తసమాజాన్ని ఆధ్యాత్మిక విశేష ప్రభావాలతో ఉర్రూతలూగించిన బాలయోగీశ్వరులు 1985 లో దేహాన్ని విడచి శివైక్యం పొందిన తరువాత, వారి పేరు పెట్టుకుని, లోక్ సభ స్పీకర్ గా ఎదిగిన శ్రీ GMC బాలయోగి గారు, IAS అధికారి శ్రీ KSR మూర్తి గారి వంటి ప్రముఖుల కృషి వల్ల అలయాభివృద్ధి జరిగి, ఉత్సవాలు ఘనంగా జరిగేవి.
సేకరణ: ప్రకాష్ చోడపనీడి Mummidivaram Mummidivaram Mummidivaram_vision2025 Mummidivaram TDP Mummidivaram Amalapuram Daily Amalapuram Konaseema Konaseema Yuva Railway Sadhana Samithi Konaseema Media కోనసీమ సోయగాలు East Godavari