04/06/2023
#ఏరువాక #పున్నమికి #నాగలి #పట్టిన #మండలి #బుద్ధప్రసాద్
--ఎద్దులను అలంకరించి పొలాలకు తీసుకెళ్లిన రైతులు
--భూమి పూజ అనంతరం వ్యవసాయ పనులు ప్రారంభం
మోపిదేవి: మండల పరిధిలోని బొబ్బర్లంక గ్రామంలో ఏరువాక పౌర్ణమిని రైతులు ఆనందోత్సాహాల నడుమ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. పొలాల్లో భూమి పూజ నిర్వహించి, నాగలితో దుక్కిదున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నాగరికత ఎంత మారినా నాగలి లేకుండా వ్యవసాయం జరగదని, రైతు లేకుండా పూట గడవదని అన్నారు. ప్రతి ఏడాది జ్యేష్ట పూర్ణిమ నాడు అన్నదాతలు ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లకు పూలు, పసుపు, కుంకుమ, ధూప దీపాలు మొదలైనవాటితో పూజించి, దుక్కి దున్నడంతో ప్రారంభించి, వ్యవసాయ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటూ వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన్ని ఎంతో గొప్పగా జరిపేవారమని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అబద్ధపు మాటలతో మోసగించటం సరిపోతుంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు కూడా సరిగా చెల్లించటం లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్లుగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రైతుల సమస్యలను ఎన్నిసార్లు, ఎంతమంది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా చీమకుట్టినట్లు కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు అన్నారు. రాష్ట్రంలో మిల్లర్లకు వ్యతిరేఖంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులను నమ్మించి, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని రైతులను మోసం చేసి భారీ అవినీతికి వైసీపీ నాయకులు పాల్పడ్డారని అన్నారు. అకాల వర్షాలకు నియోజకవర్గంలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నప్పటికీ కనీసం ఉద్యానవన శాఖ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదని, వర్షాలకు పంట తడిచిపోయి, మొక్కజొన్న పంట మొత్తం మొలకలు వచ్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో దెబ్బతిన్న పంటలకు ఇన్సూరెన్స్ ఇచ్చేవారమని, కానీ ఇన్సూరెన్స్ కూడా మేమే కడతాం అంటూ రైతులను మోసం చేసి, నేడు భీమా లేదు అంటూ రైతులను నట్టేట ముంచారు అన్నారు. రైతులంటే చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని, రైతు వ్యతిరేకిగా జగన్మోహనరెడ్డి ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ యాంత్రీకరణను తీసుకుని వచ్చారని, రైతులకు ట్రాక్టర్లు, నాగలి వంటి పలు యంత్రాలను రైతులకు అందించారని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణాలు రాష్ట్ర ప్రజల కోసం కంటే కేసుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యాయని విమర్శించారు. సమాజ ప్రయోజనాలను గురించి ఆలోచించకుండా స్వార్థ ప్రయోజనాలను ముఖ్యమంత్రి కాపాడుకుంటున్నారని అన్నారు. అనంతరం పసుపు, మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులు మండలి ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు మద్దతు ధరను ఇవ్వకుండా ప్రభుత్వం తమని ఇబ్బంది పెడుతోందని, రైతు భరోసా కేంద్రాలలో పేరు నమోదు కోసం వెళ్తే కులం ఏమిటని అడుగుతున్నారని, రైతుకు కులం ఏమిటో అర్థం కావడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, మోపిదేవి మండల ఎంపీపీ రావి దుర్గావాణి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, మండల అధ్యక్షులు నడకుదిటి జనార్ధనరావు, బొబ్బర్లంక గ్రామ సర్పంచ్ గంగా భవాని, దొప్పలపూడి జగదీష్, జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నేతలు గొర్రెపాటి రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, అయినంపూడి బానుప్రకాష్, రావి రత్నగిరి, కోనేరు చంద్రమౌళి, చల్లపల్లి మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, తెలుగు మహిళ జిల్లా నేతలు పైడిపాముల కృష్ణకుమారి, దివి యుగంధరి, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, చందన రంగారావు, సర్పంచ్ దిడ్ల జానకీ రాంబాబు, రైతులు బాల భార్గవ్, కల్లేపల్లి రమేష్, కోటేశ్వరరావు, బాల సాంబశివరావు, బాల రాము, గ్రామ మహిళలు కోనేరు సౌమ్య, కావ్య, బాల శకుంతల, గ్రామస్తులు కోనేరు నాగేశ్వరరావు, వేణుగోపాలరావు, తేజ, భార్గవ్, నాగబాబు తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు.