01/06/2026
"నో హెల్మెట్ నో ఫుయల్" కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
ప్రయోగాత్మకంగా బాపట్ల టౌన్, రూరల్, వెదుళ్ళపల్లి, కర్లపాలెం పోలీస్ స్టేషన్ ల పరిధిలలో అమలు
హెల్మెట్ భారం కాదు బాధ్యత, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. "నో హెల్మెట్ నో ఫుయల్" అను కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు జూన్ 1 సోమవారం నుండి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా బాపట్ల పట్టణ, రూరల్, వెదుళ్ళపల్లి, కర్లపాలెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో అమలు చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు, సిబ్బంది పెట్రోల్ బంకుల వద్ద విధులు నిర్వహిస్తూ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత, దానిని ధరించడం వలన కలిగే ఉపయోగాల గురించి ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నేటి నుండి "నో హెల్మెట్ నో ఫుయల్" కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు బాపట్ల రూరల్, వెదుళ్ళపల్లి, కర్లపాలెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే… హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించిన వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం… ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగులుతుందన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘శిరోరక్ష – ప్రాణ రక్ష’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుండి చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల, చీరాల, రేపల్లె సబ్ డివిజన్ లలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో హెల్మెట్ అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. దీని వలన చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధారణను అలవాటు చేసుకున్నారన్నారు.
ఇటీవల చోటు చేసుకున్న కొన్ని రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనాలను నడిపే వారు ఇంకా అక్కడక్కడా హెల్మెట్ ధరించక ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయన్నారు. "శిరోరక్ష - ప్రాణ రక్ష" కార్యక్రమం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించినప్పటికీ కొంతమందిలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే సదుద్దేశంతో "నో హెల్మెట్ - నో ఫ్యూయల్" అనే కార్యక్రమాన్ని జూన్ 1 నుండి బాపట్ల టౌన్, రూరల్, వెదుళ్ళపల్లి, కర్లపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు.
ద్విచక్ర వాహనంపై ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా అందులో పెట్రోల్ నింపుకోవడం తప్పనిసరి కాబట్టి, పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్ లేనిదే పెట్రోల్ నింపకపోతే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
జిల్లా కేంద్రంలో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని, జరిమానాలకు భయపడి కాదు… మీ కుటుంబం కోసం, మీ ప్రాణం కోసం హెల్మెట్ ధరించాలని ప్రజలకు తెలిపారు.
Andhra Pradesh Police