01/06/2026
**కూటమి పాలనలో నిత్యం సంక్షేమ పండగే: ఎమ్మెల్యే ప్రత్తిపాటి**
* లబ్ధిదారులకు సామాజిక పింఛన్ల పంపిణీ
* రూ.30 లక్షలతో బధిర పాఠశాలకు శంకుస్థాపన
* జగన్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: ప్రత్తిపాటి పుల్లారావు
**చిలకలూరిపేట:** ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పండగ నడుస్తోందని చిలకలూరిపేట ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఆయన చిలకలూరిపేట పట్టణంతో పాటు గొట్టిపాడు, గణపవరం, అప్పాపురం గ్రామాల్లో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం గణపవరంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న బధిర పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అప్పాపురంలో చౌకధరల దుకాణాన్ని, గొట్టిపాడులో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నెలకు రూ.2,728 కోట్లతో 62.76 లక్షల మందికి పింఛన్లు అందిస్తోందన్నారు. అర్హులెవరికీ పింఛన్లు నిలిపివేయలేదని, డీఎస్సీ, పింఛన్లపై మాజీ సీఎం జగన్ కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలోనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.