07/04/2024
ఎమ్మెల్సీల ఎగ్జిట్ మిస్టరీ..?
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు.
ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వైసీపీలో ఎమ్మెల్సీలు ఒకరి వెనుక మరొకరు నెమ్మదిగా జారుకుంటున్నారు. ఇదెందుకో అర్థం కావడం లేదు..? వీళ్లు ఎందుకీ విధంగా వెళ్లిపోతున్నారో అంతుచిక్కడం లేదు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందడం లేదు.
ముందుగా వంశీ కృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య, జంగా కృష్ణమూర్తి, ఇక్బాల్ ఇప్పటికే రాజీనామా బాట పట్టారు. అలాగే వైసీపీ నుంచి బయటకు వెళ్తారని మరో ఎమ్మెల్సీ పేరు కూడా వినిపిస్తుంది. ఇలా ఎమ్మెల్సీలు క్యూ కట్టి మరీ ఎందుకు బయటకు వెళ్తున్నారో అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఎమ్మెల్సీల విషయానికొస్తే.. ఒక్క వంశీకృష్ణ యాదవ్ మినహా మరెవ్వరికి ఎలాంటి పదవులు వేరే పార్టీల్లో దక్కలేదు. ఎన్నికల్లో సీట్లు దొరకలేదు. అస్సలు ఏ మాత్రం పార్టీ అధినాయకత్వంతో గొడవలు లేని ఎమ్మెల్సీలు.. అందునా.. నాన్ కాంట్రావర్సీ నేతలు.. ఇలా బయటకు వచ్చేయడమేంటోనని జుట్టు పీక్కున్నా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పైగా వీరేమన్నా.. తమకిచ్చిన ఎమ్మెల్సీ పదవుల గడువు ముగిసే సమయంలో వైసీపీకి రాజీనామా చేశారా..? అంటే అదీ లేదు. 2024 ఎన్నికల తర్వాత కూడా రెండేళ్లు.. మూడేళ్లు వరకు చట్టసభల్లో ఉండే అవకాశం ఉన్నవారే వీళ్లంతా.
అలాంటి పరిస్థితుల్లో అధికార వైసీపీ నుంచి సదురు ఎమ్మెల్సీలు ఎందుకొచ్చేస్తున్నారు..? పైగా బయటకు వచ్చిన ఎమ్మెల్సీల్లో ఇద్దరు బీసీలు, ఓ బలిజ, ఓ మైనార్టీ ఉన్నారు. ప్రతి రోజూ మేమంతా సిద్దం సభల్లో సీఎం జగన్ నా నా నా అంటూ ఏ వర్గాల గురించి చెబుతారో.. ఆ వర్గాల వారే ఇలా బయటకు వచ్చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడో పూర్వ కాలంలో.. అదీ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లల్లో పదవులను గడ్డిపోచల్లా త్యజించి వచ్చేసిన నేతల గురించి విన్నాం.. రాన్రాను.. పదవుల కోసం ఏ గడ్డి అయినా కరిచే నేతలే ఇటీవల కాలంలో చాలా మంది కన్పించారు.
ఇలాంటి రోజుల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీల ఎగ్జిట్ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవి పోయాకో.. పదవుల కోసమో వెళ్లే రాజకీయ నేతలున్న ఈ రోజుల్లో పదవులను సైతం వదులుకుని వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారంటే.. ఏంటి అర్థం..? ఇది దేనికి సంకేతం..?