01/09/2026
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్
చిత్తూరు, సెప్టెంబర్ 01: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ సుమిత్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో అధిక ప్రమాదాలు నమోదవుతున్న NH-69 (బెంగళూరు–పలమనేరు–చిత్తూరు–చెన్నై), NH-140 (చిత్తూరు–తిరుపతి), NH-42 (కుప్పం–పలమనేరు) రహదారులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారులపై తగిన లైటింగ్, రహదారి భద్రతా ప్రమాణాలు, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై నిర్వహించిన సంయుక్త తనిఖీలలో గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సరిదిద్దాల్సిన చర్యలతో నివేదిక సమర్పించాలని సంబంధిత NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. PM-RAHAT పథకం అమలు, ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం, 104/108 అత్యవసర సేవల పనితీరుపై కూడా సమీక్షించారు.
రోడ్డు భద్రతపై ప్రజల నుంచి వస్తున్న సూచనలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఎస్పీ, డీటీసీ, డీఎఫ్ఓ, ఎస్ఈ ఆర్అండ్బీ, NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్లు/ఈఈలు, డీఈఓ, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్టీసీ ఆర్ఎం, డీపీఓ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీఎస్పీడీసీఎల్, 104/108, ఐఆర్ఏడీ, ఇన్సూరెన్స్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.