27/07/2024
నారా లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ఉన్మాదం
వైయస్ జగన్మోహన్రెడ్డి గారి ప్రెస్మీట్కు వచ్చిన రిపోర్టర్ల పేర్లు, వారి ఫోన్ నంబర్లు జాబితాను పోస్ట్చేసి ఉన్మాదం చాటుకున్న వైనం
జగన్గారికి కేటాయించిన భద్రతా సిబ్బంది నుంచి నేరుగా లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు వివరాలు
దీంతో వైయస్ జగన్ గారికి ప్రభుత్వం కేటాయించిన భద్రతా వ్యవస్థలోనూ బయటపడ్డ లోపాలు
మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ముప్పు
ఆ ఫోన్ నంబర్ల ఆధారంగా నిన్నటి నుంచి సంబంధిత రిపోర్టర్లకు వేధింపులు
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ఇతర ప్రజాసంబంధిత అంశాలపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కవర్చేస్తున్న బీట్ రిపోర్టర్లను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు ఆహ్వానించడం జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి కొన్నేళ్ల క్రితమే బహిష్కరించినందున సహజంగానే ఈటీవీ, టీవీ-5, ఏబీఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లోమీడియాను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. టీడీపీకూడా చాలా మీడియా సంస్థలపై నిషేధాన్ని కొనసాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా వాటిపై నిషేధాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల ఆ ఛానళ్లు రాకుండా కేబుల్ ఆపరేటర్ల ద్వారా బ్యాన్కూడా చేయించిన విషయం అందరికీ తెలిసిందే.
జగన్గారి పత్రికా సమావేశానికి వచ్చే రిపోర్టర్లకు ఎంట్రీ విషయంలో ఎలాంటి ఇబ్బందిరాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి జాబితాను, ఫోన్ నంబర్లను పార్టీ కార్యాలయ సిబ్బంది గేటు వద్దనున్న సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. ఈ జాబితానే నేరుగా ఫొటో తీసి లోకేష్ మనుషులకు, అక్కడనుంచి టీడీపీ, లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు విడుదలచేశారు. వారు తమ సోషల్మీడియా అకౌంట్ల లోనూ, వారి సోషల్ మీడియా మనుషులతోనే ఈజాబితాలను బహిర్గతంచేస్తూ అమానవీయమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైన రిపోర్టర్ల ఫోన్ నంబర్లు సోషల్మీడియాలో పోస్ట్చేయడంతో నిన్నటినుంచి టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఇష్టానుసారంగా వారికి ఫోన్లు చేసి వేధింపులకు దిగారు. ఈ పత్రికా సమావేశానికి హాజరైన వారిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారి ఫోన్లకు గడచిన 36 గంటలుగా అసభ్య మెసేజ్లు, కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉన్మాదాలు ఈస్థాయిలో ఉన్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమపై వేధింపులకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్టుగా ఈ ఘటన కనిపిస్తోందన్న వ్యాఖ్యలు జర్నలిస్టులనుంచి వినిపిస్తున్నాయి.
ఇటు టీడీపీకూడా కొన్ని మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులను తమ పార్టీ కార్యాలయానికి గాని, ముఖ్యమంత్రి నిర్వహించే పత్రికా సమావేశాలకుగాని రానివ్వడం లేదు. జగన్గారి మీడియా సమావేశాలకు ఆహ్వానించకపోతే దాన్ని పాత్రికేయులను నియంత్రించినట్టుగానూ, చంద్రబాబు ఆహ్వానించకపోతే దాన్ని ప్రజాస్వామ్యంగా చూపించే ప్రయత్నాన్ని ఈఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నిన్నటినుంచి ఆ జాబితాను పోస్టు చేస్తూ కామెంట్ చేస్తున్నాయి.
నిజానికి ప్రతిపక్షంలోనైనా, ఇప్పుడు అధికారం పక్షంలోనైనా కొంతమంది రిపోర్టర్లే చంద్రబాబు, టీడీపీ బీట్లు చూస్తారు. విషయం ఏంటంటే… వీరంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. ఏబీఎన్ నుంచి ఉన్న రామారావు, టీవీ-5 నుంచి ఉన్న రాకేష్, ఈటీవీ తరపున ఉన్న కృష్ణ, టెన్ టీవీ నుంచి ఉన్న రవిచంద్ర, ఆంధ్రజ్యోతి భార్గవ, ఈనాడు బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాస్, మహాటీవీనుంచి అనిల్ వీరంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు విశేషం. ఇది ఆ జర్నలిస్టుల తప్పుకూడా కాదు. తనకి సంబంధించిన వాళ్లే తనచుట్టూ ఉండాలన్న చంద్రబాబు ఆలోచనా ధోరణివల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ జగన్గారు ఏనాడూ కూడా తన సామాజిక వర్గానికి చెందిన రిపోర్టర్లు మాత్రమే తన వెనుక ఉండాలని అనుకోలేదు.
అన్నిటికంటే కీలక అంశం ఏంటంటే.. జగన్గారికి కేటాయించిన సెక్యూరిటీ సిబ్బంది, ఆయన రక్షణకోసం ఉన్నట్టుగా కనిపించడంలేదు. ఆయన్ని కలవడానికి వచ్చేవారి వివరాలు ఇలా వెల్లడిస్తూ ఆయన భద్రతకు ముప్పుతెచ్చేలా వ్యవహరిస్తున్నారు. లేకపోతే ఈ జాబితా ఎలా బయటకు వెళ్లింది? అనే దానిపై తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.