20/04/2026
➤ APK ఫైల్ మోసాలకు బ్రేక్: అప్రమత్తతతో బాధితులకు 100% న్యాయం
➤ గోల్డెన్ అవర్లో ఫిర్యాదు - 100% డబ్బు రికవరీతో నేరగాళ్లకు చెక్ : జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గారి ఆదేశాలు, నిరంతర పర్యవేక్షణతో గద్వాల జిల్లా పోలీసులు సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది అసాధారణమైన చురుకుదనం, సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితులకు నష్టం లేకుండా 100 శాతం డబ్బును తిరిగి రికవరీ చేయడం విశేషం.
సైబర్ మోసాల్లో డబ్బు కట్ అయిన వెంటనే వచ్చే మొదటి 1 గంటను “గోల్డెన్ అవర్” అంటారు. ఈ సమయంలో వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఖాతాను ఫ్రీజ్ చేసి, డబ్బును తిరిగి రికవరీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
మొదటి ఘటనలో, గద్వాల పట్టణానికి చెందిన జయన్న అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా వచ్చిన ఫేక్ APK ఫైల్ను ఓపెన్ చేయడంతో, సైబర్ నేరగాళ్లు అతని మొబైల్ ఫోన్ను హ్యాక్ చేసి, అతని క్రెడిట్ కార్డు ద్వారా రూ.44,921ను అక్రమంగా దోచుకున్నారు. డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్ను ఆశ్రయించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సైబర్ సెల్ సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్ క్షణాల్లో స్పందించి, సైబర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు సంబంధిత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. దర్యాప్తులో ఆ మొత్తంతో ఫ్లిప్కార్ట్లో రెండు మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేసినట్లు గుర్తించి, వెంటనే ఫ్లిప్కార్ట్ అధికారులతో సమన్వయం చేసి ఆ ఆర్డర్ను రద్దు చేయించారు. ఫలితంగా రూ.44,921 మొత్తాన్ని పూర్తిగా బాధితుడి ఖాతాలోకి తిరిగి జమ చేయగలిగారు.
ఇక రెండో ఘటనలో, ధరూర్కు చెందిన బి. కృష్ణకు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి, KYC పేరుతో ఫేక్ APK ఫైల్ పంపించారు. ఆ ఫైల్ను ఓపెన్ చేయడంతో అతని ఫోన్ హ్యాక్ అయి, కొద్దిసేపటికే రూ.15,696 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు జిల్లా సైబర్ సెల్ను సంప్రదించగా, సిబ్బంది వేగంగా స్పందించి సంబంధిత బ్యాంకులకు సమాచారం అందించి, నేరగాళ్లు డబ్బును విత్డ్రా చేయకముందే ఖాతాను ఫ్రీజ్ చేయించారు. దీంతో మొత్తం రూ.15,696ను సురక్షితంగా తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేయించారు.
ఈ రెండు ఘటనలలో బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి స్వయంగా వచ్చి, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గారిని కలిసి, సైబర్ సెల్ సిబ్బంది వేగవంతమైన స్పందనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్పై స్పందించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, సైబర్ సెల్ సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్లను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే స్పూర్తితో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
సైబర్ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు, APK ఫైళ్లు, అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సైబర్ హెల్ప్లైన్ 1930 లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.