06/08/2026
➤ "సురక్ష కా తిరంగా" అనే థీమ్ తో సైబర్ నేరాలపై సమరశంఖం
⟹ సైబర్ నేరాలపై అప్రమత్తతే ప్రజలకు అసలైన రక్షణ:
⟹ సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు-2026 స్వతంత్ర మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" మహత్తర సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని MALD డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై "సురక్ష కా తిరంగా" ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యతగా మారిందని అన్నారు. "ఆగు... ఆలోచించు... నిజం నిర్ధారించు... సైబర్ భద్రత పెంచు" అనే "సురక్ష కా తిరంగా" సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులతో పాటు ప్రజల అప్రమత్తత కూడా అత్యంత కీలకమని అన్నారు. ప్రస్తుతం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, APK ఫైల్ మోసాలు, ఆన్లైన్ లోన్ యాప్ మోసాలు, నకిలీ ఉద్యోగాల ఆఫర్లు, ఓటీపీ, కేవైసీ అప్డేట్ పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలు, గుర్తు తెలియని లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా సందేశాలను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే సమయం వృథా చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లోని సైబర్ సిబ్బందిని సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. వేగంగా స్పందిస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.
"సురక్ష కా తిరంగా" ద్వారా ప్రతి ఇంటికి సైబర్ భద్రత సందేశాన్ని చేరవేసి, సైబర్ నేర రహిత జోగుళాంబ గద్వాల జిల్లాతో పాటు సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో సైబర్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ ఖలందర్ భాష మాట్లాడుతూ, నేటి కాలంలో ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్, సోషల్ మీడియాను వినియోగిస్తున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై అవగాహన అత్యంత అవసరమన్నారు. పోలీసులు తెలియజేసిన సూచనలను ప్రతి విద్యార్థి పాటించడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. ఖలందర్ భాష, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. చంద్రమోహన్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ వి. సురేందర్ రెడ్డి, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, జిల్లా D-4-C సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.