25/01/2026
విజయవాడ: 25 జనవరి:
విద్యార్హతకు తగిన ఉద్యోగం.. సీపీఐ లక్ష్యం.. ఈశ్వరయ్య!
ప్రభుత్వ ఉద్యోగాల కాలెండర్ మాత్రమే కాదు.. ప్రయివేటు ఉపాధి అవకాశాలపై కూడా సీపీఐ పోరాటం!
o లక్ష్యం చేరే దాకా.. వృత్తులు , విభాగాలు, అంశాలవారీగా నిరుద్యోగ రణభేరి కార్యక్రమాలు!
o లక్ష మంది ఫార్మసిస్టుల ఉపాధి అవకాశాలను గండికొడుతున్న ఫార్మసీ కౌన్సిల్, ఔషదనియంత్రణ శాఖ, డ్రగ్స్ ట్రేడ్ మాఫియాలపై ప్రత్యేక దృష్టి!
నగరంలోని సీపీఐ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రికాసమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన విజయవాడలో ఏఐవైయఫ్ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తలపెట్టిన నిరుద్యోగ రణభేరి కార్యక్రమ వివరాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. ఈ రణభేరిలో అపరిష్కృతంగా ఉన్న మూకుమ్మడిగా ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా శాఖల వారీ, విభాగాల వారీ, అంశాలవారీ వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వత్తిడి తేవడం జరుగుతుంది. నిరుద్యోగ రణభేరి ద్వారా రెవిన్యూ, విద్య, వైద్యారోగ్య, మునిసిపల్ ఇలా ప్రతి ప్రభుత్వ శాఖలలో దీర్ఘకాలంగా ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీ ప్రకటనలకు సీపీఐ డిమాండ్ చేస్తుందని అన్నారు. బాబతోనే జాబు అంటూ నిరుద్యోగుల్లో ఆశలు నింపి వారి ఓట్లు దండుకొని గెలిచిన ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా ఇదిగో జాబ్ కాలెండర్ అదిగో జాబ్ కాలెండర్ అంటూ కాలయాపన చేస్తుండడాన్ని సీపీఐ నిరసిస్తుంది. నిరుద్యోగ భృతి ఇస్తాం, యువతలో ప్రతి ఒకరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అన్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాలను సైతం పీకడంతో తప్ప కొత్త వాటికి ప్రయత్నం చేయలేదన్నది సుసృష్టం అవుతున్నదని ఆయన అన్నారు.
విజయవాడలో ఏఐవైయఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రణభేరి ఒక్క రోజు ప్రక్రియ ఉద్యమం కాబోదని, ఇప్పటి నుంచి దశలవారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివిధ వృత్తుల, రంగాల నిరుద్యోగ యువకులతో, వారి వారి వృత్తి పరమైన సంఘాలతో సహా కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టడానికి సీపీఐ రాష్ట్ర శాఖ ఒక ప్రణాళిక సిద్దం చేస్తుందని ఈశ్వరయ్య తెలిపారు. ప్రభుత్వ రంగాలోనే కాదు, ప్రయివేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలకోసం సీపీఐ పోరాడుతుందని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా ఇటీవల తన దృష్టికి వచ్చిన వాటిల్లో ప్రధానమైన అంశం – ఫార్మసీ నిరుద్యోగ వృత్తి నిపుణుల సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని వారి పేరుపై లైసెన్సులు పొంది ఔషధ దుకాణాల నిర్వహణ. ఈ మేరకు రాష్రంలోని పలు ఫార్మసిస్ట్ సంఘాలు తనను కలిశాయని, నిరుద్యోగ రణభేరిలో తమ అంశం ప్రత్యేకంగా ప్రస్తావించాలని వారు కోరారు. రాష్ట్రంలో వున్న 60000 మందుల దుకాణాల రికార్డుల్లో వారిని ఉద్యోగులుగా చూపిస్తూ చదువు రానివారితో ఔషధాలు అమ్మిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటాడుకుంటున్న డ్రగ్స్ ట్రేడ్ మాఫియా వెనుక ఏటా 1000 కోట్ల లంచాల విషయం తెలిసి అవాక్కాయన్నన్నారు. ఇటీవల జరిగిన ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా సదరు డ్రగ్స్ ట్రేడ్ మాఫియాకు వత్తాసు పలికిన అధికారులపై సీపీఐ ఇప్పటికే ఫిర్యాదు చేసిందన్నారు. విచారణ జరగకుండా కౌన్సిల్ మెంబర్ల నియామక జీవో ను దొడ్డిదారిన ఇవ్వడానికి ప్రయత్నిస్తే సీపీఐ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. ఫార్మసిస్టుల అద్దె సర్టిఫికెట్ల మాఫియాలను అడ్డుకుంటే ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు 60000 ఉద్యోగాలు రావడంతో పాటుగా వారి జీతాలు మహారాష్ట్ర కేరళ తరహాలో 60 నుంచి 70 శాతం మేరకు పెరిగి ప్రతి ఒక్కరికి రూ. 250000/- పైచిలుకు కనీస వేతనం వచ్చే అవకాశాలు వున్నాయని, ఈ మేరకు తాను ఇప్పటికే నిపుణులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసుకున్నానని ఈశ్వరయ్య తెలిపారు.
ఇలాగే ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ప్రతి ఉద్యోగ అవకాశాన్ని విశ్లేషించి, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏటా ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టి హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్, నియామక ప్రకటనల కోసం సీపీఐ నిరుద్యోగ రణభేరిని నిరంతరం కొనసాగిస్తామని ఈశ్వరయ్య అన్నారు. తన ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అందరి మన్ననలను పొందే విధంగా ప్రజాసమస్యలపై పోరాడే తత్వాన్ని సీపీఐ అలవరచుకుంటుందని, ఈ నిరుద్యోగ రణభేరికి అందరూ నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు హాజరవ్వాలని, ఫార్మసిస్టుల మాదిరిగానే మిగతా నిరుద్యోగ వృత్తి నిపుణుల విషయంలో ఆయా సంఘాలతో చర్చించి ప్రత్యేక నిరుద్యోగ రణభేరి కార్యక్రమాలు జరపాలన్న యోచనలో సీపీఐ వున్నదని ఆయన తెలిపారు.