19/10/2015
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నేటితో ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శంకుస్థాపన ప్రాంగణం దగ్గర భద్రతను భారీగా పెంచుతున్నారు. ఈనెల 22న జరుగనున్న అమరావతి శంకుస్థాపన పనుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది.
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పట్లు చివరి దశకు చేరుకున్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. శంకుస్థాపనకు తరలివచ్చే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు రైతులు, ఇతరులు ఉత్సాహం చూపుతున్నారు.
నేరుగా సభా ప్రాంగణంలోనే డబ్బులు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని సెంటిమెంట్గా భావిస్తున్నారు. దీంతో సభా ప్రాంగణంలో మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమైన యజ్ఞశాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే ప్రధాని మోదీ కరకట్టల ఆవరలో ఉన్న హెలీప్యాడ్ నుంచి యాగశాలలోకి ప్రవేశించనున్నారు.
యాగశాలలో పూజలు నిర్వహించి సీఎంతో పాటు రాజధానికి శంకుస్థాన చేసి ఆయన వేదికపైకి చేరుకుంటారు. యాగశాలలో 21 నుంచి పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. శంకుస్థాపన ప్రాంగణం దగ్గర భద్రతను భారీగా పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్న పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 11వేల మంది పోలీసులతో భద్రతను చేపడుతున్నట్లు హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పనులను పరిశీలించారు.
అడిషనల్ డీజీ సురేంద్రబాబు ట్రాఫిక్ మళ్లింపు గురించి మంత్రులకు వివరించారు. పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. శంకుస్థాపన మహోత్సవానికి దాదాపు ఏడు వేల మంది వీఐపీలు, వీవీఐపీలు ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. అతిథుల కోసం పూర్ణం, బూరెలు, చెక్కర పొంగలి, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు సహా ఆంధ్రా పిండివంటలను, స్పెషల్స్ను సిద్ధం చేస్తున్నారు. రైతులకు, ప్రజలకు ప్రత్యేకంగా మరో మెను.
దాదాపు 15వేల మంది రైతులు, లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రజలు శంకుస్థానకు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి పులిహోరా, దద్దోజనం, చెక్కెరపొంగలి, అరటిపండు, తాపేశ్వరం కాజా, మూడు మంచినీళ్ల ప్యాకెట్లను మరో ప్యాకెట్లో పెట్టి ఇవ్వాలని నిర్ణయించారు. 22న విజయదశమి రోజు ప్రధాని మోదీ ఉపవాస దీక్షను ముగిస్తే ఆంధ్రా వంటకాలతో భోజనం చేస్తారని లేకపోతే తేనె కలిపిన నిమ్మరం మాత్రమే తాగుతారని పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రధాని మెనూలో ఉలవచారును కూడా చేర్చాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా రాజధాని కోసం తరలించిన మట్టిని, నీటిని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భద్రపరుస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి రాజధాని కోసం తరలిస్తున్న మట్టి, నీటి కళశాలకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించి పూజలు నిర్వహిస్తున్నారు.
For more latest hot and happening news subscribe @ https://www.youtube.com/user/ABNtelugutv?sub_confirmation=1 Follow us @ https://facebook.com/abntelugutv, ...