05/08/2026
ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి పెట్టుబడులు పెట్టి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ ప్రజలకు సూచించారు.
జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు" రాష్ట్రవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో కాజీపేట నిట్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
మోసగాళ్లు "100% గ్యారంటీ రిటర్న్స, "డైలీ ప్రాఫిట్", "ఇన్సైడర్ టిప్స్", "ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు" వంటి తప్పుడు హామీలతో అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. నకిలీ ట్రేడింగ్ యాప్లు, నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రారంభంలో నకిలీ లాభాలను చూపించి, అనంతరం మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి, చివరకు క్యాష్ అవుట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, అప్గ్రేడేషన్ ఛార్జీలు వంటి పేర్లతో అదనపు డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
అదేవిధంగా, నకిలీ ఆర్థిక సలహాదారులు, నకిలీ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, చట్టబద్ధమైన అనుమతులు లేని సంస్థల ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేస్తూ, అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడి అవకాశాన్ని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సూచనలను విశ్వసించవద్దని, వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వ్యక్తులను నమ్మరాదని పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టే ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ సైబర్ నేరాలపై రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామని విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో నిట్ కళాశాల డైరెక్టర్ డా. ప్రొఫెసర్ సుబుధి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, రిజిస్ట్రార్ సునీల్ మెహతా, ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్స్పెక్టర్లు శ్యామ్ సుందర్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు