05/08/2026
ఢిల్లీ : కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు.
ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ..
🔸హైదరాబాద్ జనాభా 30 లక్షలు ఉన్న సమయంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేశారు. కానీ, నేడు నగరం 2 కోట్లకు పైగా జనాభాతో విస్తరించినా, ఇప్పటికీ చెత్తనంతటినీ ఆ ఒక్క ప్రాంతంలోనే వేస్తున్నారు.
🔸రోజుకు దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడకు చేరడంతో కొండల్లా పేరుకుపోతోంది. దీనివల్ల 40 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ సంపాదనంతా ఆసుపత్రుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
🔸ఈ తీవ్రమైన సమస్యపై కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం అని తెలిపారు.
🔸జవహర్ నగర్లో ఒక్క కిలో చెత్త కూడా వేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, గాలి, నీటి కాలుష్యం లేని 'జీరో పొల్యూషన్' పద్ధతుల్లో చెత్తను రీసైకిల్ చేయాలని కోరారు.
🔸ఢిల్లీ లాంటి మహానగరాల్లో అనుసరిస్తున్న చెత్త నిర్వహణ (వేస్ట్ మేనేజ్మెంట్) విధానాలను హైదరాబాద్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.
🔸వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కెపాసిటీ కేవలం 3,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కాగా, నిత్యం 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని.. అసలు ఆ ప్లాంట్ సరిగ్గా పనిచేస్తోందో లేదో పర్యవేక్షించే నాథుడే లేడని విమర్శించారు.
🔸ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసు వేశారని గుర్తుచేశారు. కానీ, ఆయన సీఎం అయినప్పటికీ ప్రజల రాత మారలేదని, ఫలితం శూన్యంగా మిగిలిపోయిందని విమర్శించారు.
ఈ సమావేశంలో ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు ఉన్నారు.