07/05/2020
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రంజాన్ మాసం కావటంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం గురించి.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించింది. ఇప్పటికే గత 46 రోజులుగా లాక్ డౌన్ కారణంగా ముస్లిం కుటుంబాలలో పేదలు, రోజువారి కూలీలు, ఫుట్ పాత్ లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారు, ఆటో డ్రైవర్లు, మెకానిక్స్, టాక్సీ డ్రైవర్లు, చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుని రోజువారి సంపాదనతో జీవితాలు గడిపేవారు అర్ధాకలితో జీవిస్తున్నారు. ముస్లిం మైనారిటీలలో 80శాతానికి పైగా ఇలాంటి వారున్నారనే విషయం తమరికి తెలియనిది కాదు. రంజాన్ మాసం కావటం వల్ల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనితో ఆ కుటుంబాలపై మరింత భారం పడింది. ఇంటి ఓనర్లు కిరాయి కోసం వేధించడం మొదలుపెట్టారు. బయట అప్పులు కూడా లభించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆదుకోకుంటే వారి జీవితాలు దుర్భరంగా మారి అనేక సామాజిక సమస్యలకు దారితీయవచ్చు. కావున ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకోవాలని ఆప్ కి ఆవాజ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
1) ప్రతి పేద ముస్లిం కుటుంబానికి 15000/- రూ,, ఆర్ధిక సహాయం చేయాలి.
2) వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు భూములు కాంప్లెక్స్ ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లింల కుటుంబాలకు అందించాలి.
3)ఇమామ్, మౌజన్ ల పెండింగ్ గౌరవ భృతి వెంటనే విడుదల చేయాలి.
4) రేషన్ షాపుల్లో బియ్యం తో పాటు కందిపప్పు, నూనె, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, కారం పొడి వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి.
5) సోషల్ మీడియాలో, TV మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి.
పై సూచనలు అమలు చేసి ఈ కష్టకాలంలో పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము.