03/09/2026
// గణపతి మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన పోలీసు వారి సూచనలు //
గణేష్ ఉత్సవాలు, గణపతి నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణపతి మండపాల నిర్వాహకులు క్రింది సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్ సూచించారు.
1. అనుమతులు – సింగిల్ విండో విధానం
* గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
* సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన అన్ని అనుమతులను పొందవచ్చు.
* అనుమతుల కోసం https://ganeshutsav.net/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే సంబంధిత స్థల యజమాని అనుమతి తప్పనిసరి.
* ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలి.
* ఫైర్, మున్సిపాలిటీ/పంచాయతీ, విద్యుత్ శాఖలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా పొందాలి.
* సింగిల్ విండో విధానం ఆన్లైన్ లో తప్ప ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేయరాదు.
2. ట్రాఫిక్ – ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు
* రహదారికి అడ్డంగా గణేష్ మండపాలు నిర్మించరాదు.
* రహదారులకు అడ్డంకిగా బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయరాదు.
* మండపం వద్ద జరిగే కార్యక్రమాల వల్ల రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.
* ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు మండపం వద్ద కనీసం ఒక వాలంటీర్ను నియమించాలి.
* మండపం వద్ద వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
3. మండప భద్రత – వాలంటీర్ల బాధ్యతలు
* కనీసం ముగ్గురు కమిటీ సభ్యులు/వాలంటీర్లు రాత్రి సమయంలో మండపం వద్ద ఉండి భద్రతను పర్యవేక్షించాలి.
* నాలుగు అడుగులకు మించిన విగ్రహాలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి.
* మండపం స్టేజీ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని చెక్కలతో లేదా ఇతర సురక్షిత ఏర్పాట్లతో మూసి ఉంచాలి.
* రాత్రి సమయంలో బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను మండపం వద్ద ఉన్నయెడల తగిన జాగ్రత్తలు మండపం కమిటీ వారు తీసుకోవాలి.
4. అనుమానాస్పద వస్తువులు – అప్రమత్తత
* మండపం వద్ద అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు లేదా వాహనాలు ఎక్కువ సమయం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
* మండపం వద్దకు ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులతో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మండపం కింద, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాలి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
* హాని తలపెట్టే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచి, డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలి.
5. డీజేలు – శబ్ద కాలుష్య నియంత్రణ
* పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా డీజేలు, సౌండ్ బాక్సులు, బాణాసంచా ఉపయోగించరాదు.
* ముందస్తు అనుమతి పొందిన మేరకే డీజేలు, సౌండ్ బాక్సులు, బాణాసంచా ఉపయోగించాలి.
* శబ్దం నిర్ణీత పరిమితులకు లోబడి ఉండేలా చూసుకోవాలి.
* రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు ఎలాంటి లౌడ్స్పీకర్లు ఉపయోగించరాదు.
* భక్తి పాటలు మాత్రమె ప్లే చెయ్యవలెను, సినిమా పాటలు, అసభ్యకరమైన పాటలు నిషిద్దం.
6. నిమజ్జన ఊరేగింపులలో పాటించవలసిన నియమాలు
* మద్యం సేవించి గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన రాదు.
* నిర్దేశించిన రూట్ ద్వారా నియమిత సమయంలో ముందుగా సూచించిన ఘాట్ వద్ద మాత్రమె నిమజ్జనం చెయ్యవలెను.
* గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఇతర మతాలు, కులాలు, రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదు.
* ఊరేగింపులు శాంతియుత వాతావరణంలో, పోలీసు శాఖ నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా, నిర్ణీత సమయంలో నిర్వహించాలి.
* ప్రభుత్వం అనుమతించిన నిమజ్జన ఘాట్ల వద్ద మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలి.
* నిమజ్జన సమయంలో ఎటువంటి నీటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
* ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
* పోలీస్ వారికి సహకరిస్తూ ఊరేగింపు ముందుకు కదిలించాలి మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
7. అసాంఘిక కార్యకలాపాలకు నిషేధం
* సినిమా పాటలు, అశ్లీల నృత్యాలు, అసభ్యకరమైన పాటలు, రికార్డింగ్ డ్యాన్సులు, కొజ్జా మేళం తదితర అసాంఘిక కార్యకలాపాలు గణేష్ మండపాల వద్ద లేదా ఊరేగింపుల్లో అనుమతించబడవు.
*భక్తి పాటలు మాత్రమె అనుమతించ పడతాయి.
8. విద్యుత్ – అగ్నిప్రమాదాల నివారణ
* మండపానికి అమర్చిన విద్యుత్ తీగలను ఎవరూ అనవసరంగా ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* షార్ట్ సర్క్యూట్ జరగకుండా వైర్లు, విద్యుత్ కనెక్షన్లు సక్రమంగా ఏర్పాటు చేయాలి.
* మండపంలో రాత్రి సమయంలో నూనె దీపాలు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
* అగ్నిప్రమాదాల నివారణ కోసం ఇసుక బస్తాలు, నీటి తొట్టెలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.
* మండపం వద్ద టపాకాయలు, ఇతర పేలుడు పదార్థాలు ఉంచరాదు.
9. సోషల్ మీడియా పట్ల అప్రమత్తత
* సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మరాదు.
* నిర్ధారణ కాని సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి గణపతి మండప నిర్వాహకుడు పై సూచనలను తప్పనిసరిగా పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కాకినాడ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పత్రికా ప్రకటన
తేదీ: 03-09-2026
జిల్లా పోలీసు కార్యాలయం
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police