08/01/2026
రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించి యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటర్ల తుది జాబితాను జనవరి 12న ప్రచురించనున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావస్తుండటంతో, ఈ నెల 16న ఫోటోలతో కూడిన వార్డుల వారీ తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు.
ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం సంప్రదింపుల ప్రకారం, జనవరి 20న అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
రిజర్వేషన్ల ఖరారు ఈ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుండగా, బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న న్యాయపరమైన నిబంధనల దృష్ట్యా, అధికారులు శాస్త్రీయంగా లెక్కలు వేస్తున్నారు. ఏ కేటగిరీలోనైనా సరే, కేటాయించిన స్థానాల్లో 50 శాతం సీట్లు మహిళలకే దక్కేలా రిజర్వేషన్ల రూపకల్పన జరుగుతోంది.
హైదరాబాద్ (GHMC) పరిధిని మూడుగా విభజించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉండటంతో, ప్రస్తుతానికి జీహెచ్ఎంసీతో పాటు గడువు ముగియని మరో నాలుగు మున్సిపాలిటీలను ఈ ఎన్నికల నుండి మినహాయించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగేలా 'టి-పోల్' యాప్ ద్వారా ఓటర్ల వివరాల నుంచి అధికారుల నియామకం వరకు ప్రతి అంశాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పర్యవేక్షణలో కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల సేకరణ వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
Shakthi Media - ✍️ Vikram Journalist