25/07/2015
రాహుల్ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వచ్చారు? :మంత్రి దేవినేని ఉమా..
విజయవాడ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంఽధీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు? ఆయనకు సిగ్గులేదా? కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో జక్కంపూడి వద్ద పోలవరం కాలువ పనులను పరిశీలిస్తున్న మంత్రి ఈ వ్యాఖ్యానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటలీ ఆవిర్భావం రోజున రాహుల్, సోనియా గాంధీలు ఇద్దరూ కలసి దురుద్దేశ పూర్వకంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు. రాహుల్కుగాని, సోనియాకు గాని ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి గాని, వ్యాఖ్యానాలు చేయడానికి గాని ఏమాత్రం అర్హతగాని, నైతిక హక్కు గాని లేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, శివరామ కృష్ణన్ కమిషన్ నివేదికను గాలికి వదిలేసి, విడిపోతున్న రాష్ట్రానికి ఎటువంటి హామీలు ఇవ్వకుండా, పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు గ్రామాలను ఏపీకి కేటాయించకుండా ఇష్టా రాజ్యంగా విభజించారన్నారు. తెలంగాణాలో ఓట్లు, సీట్లు కోసం ఏపీని గాలికి వదిలేసి ఇప్పుడు నీతులు ఎలా చెబుతున్నారని మంత్రి దేవినేని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి,లోటు బడ్జెట్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఎవరి మెప్పుకోసమో తెలుగు ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టిన పాపం వారిది కాదా అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం ఆయ్యాక పోలవరం ముంపు గ్రామాలను కలుపుకోవడానికి ప్రయత్నించడం, దీంతో పాటు పోలవరం పనులు శరవేగంగా నిర్వహించడానికి నిరంతరం కృషి చేసిన ఫలితంగానే ఇప్పుడు పోలవరం కుడికాలువ పనులు రేయింబవళ్ళు జరుగుతున్నాయని చెప్పారు. తాము అది చేశాం, ఇది చేశామని రాహుల్ మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఇంకా వారికి బుద్థి రాలేదన్నారు