31/08/2026
నగరానికి న్యూ లుక్ తీసుకొద్దాం
• కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ, పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు
• ప్రధాన కూడళ్లలో టర్ఫ్ గడ్డి, వాటర్ ఫౌంటెన్ల అభివృద్ధి
• డివైడర్లు, నడకబాటలకు సరికొత్త రూపు
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
నగరంలోని కూడళ్లను అభివృద్ధి చేసి, సుందరీకరణ, పచ్చదనం పెంపు పనులను చేపట్టి నగరానికి న్యూ లుక్ తీసుకొద్దామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. సోమవారం ఆయన కోట్ల విజయభాస్కరరెడ్డి, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్, మౌర్య ఇన్ తదితర కూడళ్లు, డివైడర్లను కమిషనర్, ఇంజనీరింగ్, హార్టికల్చర్ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆయా కూడళ్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పచ్చదనం పెంపునకు ఉన్న అవకాశాలను కమిషనర్ పరిశీలించారు. నగరంలోని 9 ప్రధాన కూడళ్లన అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కూడళ్లలో టర్ఫ్ గడ్డి ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న వాటర్ ఫౌంటెన్లను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన రహదారుల వెంట ఉన్న డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేయడం, అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేపట్టడం, నడకబాటలను అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. రహదారుల వెంట పచ్చదనం మరింత పెరిగేలా మొక్కలు నాటడంతో పాటు, ఇప్పటికే ఉన్న మొక్కలను సంరక్షించాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.
నగరానికి ప్రధాన ప్రవేశ మార్గాలుగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రాంతాలుగా కూడళ్లు ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కూడలిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేలా డిజైన్ రూపొందించాలన్నారు. గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలు, పచ్చదనం, ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్ వంటి అంశాలను సమన్వయం చేసి నగరానికి సరికొత్త రూపాన్ని తీసుకురావాలని తెలిపారు.
కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు నాణ్యతతో చేపట్టడంతో పాటు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చగా, సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు.
కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, హార్టికల్చర్ ఏడి ప్రతాప్ రెడ్డి, డీఈఈ కృష్ణలత, తదితరులు పాల్గొన్నారు.