29/05/2026
పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం
• యంత్రాంగంతో సమర్థవంతంగా పనిచేయించాలి
• మున్సిపల్ శాఖ సిడిఏంఏ పి.సంపత్ కుమార్, ఐఏయస్
• జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం
నగర/పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకమని, వారు బాధ్యతగా, స్మార్ట్ వర్క్తో సమర్థవంతంగా పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) పి.సంపత్ కుమార్, ఐఎయస్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో డోన్ కమిషనర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంతకుముందు గార్గేయపురం, జొహరాపురం డంప్ యార్డుల్లో బయో మైనింగ్, సి & డి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించారు. గార్గేయపురం డంప్యార్డులో ఘన వ్యర్థాల బయో మైనింగ్ జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. 15 ఎకరాల్లో బయో మైనింగ్ పూర్తి అయిన వెంటనే చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి (వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని, మరో 9.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. బయో మైనింగ్ పనులను రోజువారీ లక్ష్యాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గార్గేయపురం డంప్యార్డులో రెండు నెలల్లో, జొహరాపురం డంప్యార్డులో ఒక నెలలో బయో మైనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన సిడిఎంఏ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కమిషనర్లు ప్రతిరోజూ 2 నుంచి 3 గంటలు క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మార్పు కనిపించేలా ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని సూచించారు. ప్రజల్లో సానుభూతి పొందేలా, తద్వారా స్వచ్ఛతక ప్రజల సహకారం అందేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి జరిమానాలు విధించాలని, అయినప్పటికీ మార్పు లేకపోతే వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేయాలని సూచించారు. త్వరలో చెత్త వేస్తే జరిమానాలు విధించే విధానంపై పూర్తి విధివిధానాలతో ఉత్తర్వులు ఇస్తామన్నారు.
డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్య సమస్యలు, ప్రజా ఫిర్యాదులపై పూర్తిస్థాయి అవగాహన కమిషనర్లకు ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధుల కంటే ముందే సమస్యలు కమిషనర్ల దృష్టిలో ఉండాలన్నారు. ప్రతిరోజూ సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి అవసరమైన దిశానిర్దేశం చేయాలన్నారు. అన్ని సక్రమంగా ఉన్న ప్రాంతాల కంటే సమస్యలు ఉన్న ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. సాధారణ నిధుల ఖర్చులో నిర్వహణ పనులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే అత్యవసర పనులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
జీవో 75ను పక్కాగా అమలు చేయాలని, ప్రజాప్రతినిధులకు సైతం దీని గురించి తెలియజేయాలని ఆదేశించారు. ఇంటింటికీ డిజిటల్ క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ అమలు చేసి, శాటిలైట్ ఆధారంగా ఆస్తుల విస్తీర్ణం, ప్రభుత్వ-ప్రైవేటు సేవలకు సమాచారాన్ని అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆస్తి పన్ను వసూళ్లు మెరుగుపరచాలని సూచించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యాలని తెలిపారు. డ్రైనేజీ లేకపోతే కనీసం కచ్చా కాలువ అయినా నిర్మించాలని, ప్రతిదానిని నిధులతో ముడిపెట్టడం సరికాదన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో సాధ్యమైనంత సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ముందుగా పరిష్కరించాలని, రహదారులపై గుంతలు పూడ్చాలని ఆదేశించారు.
పూడికతీత పనులు జాప్యం చేయకుండా పూర్తి చేయాలని, ఖాళీ స్థలాలపై విఎల్టి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆయా స్థలాల యజమానుల వివరాలు సేకరించాలని సూచించారు. గార్బేజ్ పాయింట్లు లేకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య సిబ్బంది కొరత ఉంటే నిధుల లభ్యతను బట్టి టౌన్ లెవల్ ఫెడరేషన్ ద్వారా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, అధికారులు స్మార్ట్ వర్క్ చేయాలని సూచించారు. రాయలసీమ ప్రాంత పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు మొక్కుబడిగా కాకుండా కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. పైపై విధులు సరికాదని, సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
పట్టణాల వారీగా సమీక్ష నిర్వహించిన సిడిఎంఏ, కర్నూలు కార్పొరేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖచిత్ర సమాచారం, నివేదికలు, ముందస్తు చర్యలు వంటి అంశాలపై కమిషనర్ చల్లా ఓబులేసును అభినందించారు. కర్నూలులో పిన్ పాయింట్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నామని కమిషనర్ వివరించారు. చెత్త వాహనాలకు జీపీఎస్ అమర్చడం, ప్రాసెసింగ్ పాయింట్ల పర్యవేక్షణ వంటి అంశాలను వివరించారు. కర్నూలు కార్పొరేషన్ను జిల్లా మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
సమావేశంలో అనంతపురం ఆర్డిఎంఏ నాగరాజు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఎమ్మిగనూరు కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని కమిషనర్ నయీం, గూడూరు కమిషనర్ ఏ.వి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.