05/09/2026
కర్నూలు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతుల పంట నష్టాలను అంచనా వేసి రుణాలు రద్దు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోడుమూరులోని ఎస్ఎల్ఎన్ఎస్ కళ్యాణ మండపంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ పాల్గొన్నారు.
అనంతరం ఎస్ఎల్ఎన్ఎస్ కళ్యాణ మండపం నుంచి ప్రదర్శనగా బయలుదేరి కోట్ల విజయభాస్కర్రెడ్డి సర్కిల్ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని నినదించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మనోహర్, ఎమ్మిగనూరు హనుమంతు, ఆస్పరి హనుమంతు, కోటకొండ సూరి, పాలకుర్తి మద్దిలేటి, పరమేశు తదితరులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.