11/01/2015
ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీ ఎమ్మెల్యేలకు సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చింది! సంబరాలను మోసుకొచ్చింది! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కూడా ‘చంద్రన్న కానుక’ను ప్రకటించారు! నియోజకవర్గాల అభివృద్ధి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.3 కోట్ల వరకూ నిధులు కేటాయించాలని నిర్ణయించారు. మంచినీటి పథకాలు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు వీటిని మంజూరు చేస్తారు. ప్రతి శనివారం తన సమయాన్ని పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో సుమారు 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులతో ఆయన సమావేశమయ్యారు. ముందుగా వారందరితో కలిసి ఒకసారి.. ఆ తర్వాత కొందరు పార్టీ ముఖ్యులతో మరోసారి చంద్రబాబు భేటీ అయ్యారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. పార్టీ ముఖ్యుల సమావేశంలో.. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు చిన్న చిన్న పనులకు కూడా నిధులు మంజూరు చేయలేకపోతున్నామని, ఇబ్బందిగా ఉంటోందన్న అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉందన్న అంశం చర్చకు వచ్చింది. దాంతో, నియోజకవర్గానికి మూడు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. కాగా, చంద్రన్న కానుక పేరిట తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇవ్వనున్న పండగ సరుకులను జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని, రేషన్ షాపుల వద్దే వీరు పంపిణీని పర్యవేక్షించాలని నిశ్చయించారు. తద్వారా, సరుకులు పక్కదారి పట్టకుండా నిజమైన లబ్ధిదారులకే చేరతాయని భావించారు. సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకొని ఈనెల పింఛన్లను 15వ తేదీలోపే పంపిణీ అయ్యేలా చూడాలని నిర్ణయించారు. పింఛనుదారులకు ఇళ్ల వద్దే వాటిని పంపిణీ చేసేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరగా.. దానిపై పరిశీలన జరుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ధాన్యం సేకరణ తీరు ఈసారి సమస్యాత్మకంగా మారిందని కొందరు ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తేవడంతో, ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీని వేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, పౌర సరఫరాల మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఆధ్వర్యంలో కోస్తా ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన పదిమంది ప్రజా ప్రతినిధులతో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. సోమవారం ఈ కమిటీ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయిస్తుంది. సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాల్లో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఎనిమిదో తేదీ నుంచి ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో తిరగాలని ఆదేశిస్తే 40 శాతం మంది మాత్రమే తిరిగినట్లు తనకు నివేదికలు అందాయని, సంక్రాంతి వరకూ వారంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని చంద్రబాబు వారికి గట్టిగా చెప్పారు.
రుణ మాఫీ కింద రూ.3600 కోట్లు
రైతు రుణ మాఫీలో తొలి విడత చెల్లింపుల కోసం బ్యాంకులకు కేటాయించిన రూ.5000 కోట్లలో ఇప్పటి వరకు రూ.3600 కోట్లు ఆయా రైతుల ఖాతాలకు జమయ్యాయని ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. అదనంగా రూ.1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, తొలి విడత మాఫీ వర్తించిన రైతులకు చెల్లింపుల సమస్య లేకుండా చూడాలని చంద్రబాబు చెప్పారు. ఇసుక తవ్వకాల్లో వస్తున్న సమస్యలను ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారు. మాఫియా బెడద తగ్గలేదని, కొన్నిచోట్ల ధర అధికంగా ఉందని చెప్పారు. ‘‘నేను ఇసుక విషయాన్ని చాలెంజ్గా తీసుకొంటున్నాను. డ్వాక్రా మహిళలు దీనిని విజయవంతంగా చేయగలరని నిరూపించి చూపిస్తాను. ఇది ఒకదారిలో పడ్డాక ధరల తగ్గింపుపై ఆలోచిస్తాను’’ అని చంద్రబాబు అన్నారు. మార్కెట్ కమిటీల నియామకాలను సమావేశం సమీక్షించింది. తొలి విడత నియామకాల్లో బీసీలకు చాలినంత ప్రాతినిధ్యం రాలేదని, మలి విడతలో ఆ లోపం సవరించుకోవాలని నిర్ణయించారు.
ఢిల్లీలోనూ పదవులు అడుగుదాం
కేంద్ర ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల్లో తన వాటాను తెలుగుదేశం పార్టీ కోరాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక్కడ నామినేటెడ్ పదవుల్లో వాటా కోరుతూ బీజేపీ నేతలు పంపిన జాబితాల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కేంద్రంలో పదవుల గురించి అడిగారు. పార్టీలో చేరికల్లో బీజేపీతో పోటీ పడాల్సిన అవసరం లేదని, టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపిన వారిని చేర్చుకోవాలని నిశ్చయించారు. ప్రతి శనివారం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న భేటీకి పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా విధిగా సచివాలయంలో ఉండేలా చూడాలని, దీనివల్ల ఎమ్మెల్యేలకు సౌకర్యంగా ఉంటుందని భావించారు. పార్టీ ముఖ్యుల సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు ప్రభుత్వపరంగా వెంటనే అమలయ్యేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాగా, ఐఐఎం, ఐఐటీ సంస్థలకు వచ్చే శనివారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడం, ఆ తర్వాతి వారం స్విట్జర్లాండ్ పర్యటన ఉండడం వల్ల ఎమ్మెల్యేలతో ఆ రెండు శనివారాలూ చంద్రబాబు ప్రత్యేక భేటీలు వాయిదా పడే అవకాశముంది.