31/05/2026
అసభ్య ప్రవర్తన ఆనందం కాదు... అది చట్టరీత్యా నేరం... పరివర్తనే శాశ్వత పరిష్కారం — నరసరావుపేట డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు గారు,.
🚩 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి.రాజకుమారి, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో, పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ గారి సూచనల మేరకు నేడు నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఆపరేషన్ పరివర్తన సదన్” కార్యక్రమం నిర్వహించబడింది.
* సమాజంలో మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయడం, లైంగిక నేరాల పునరావృతిని నిరోధించడం, అలాగే నేరాలకు పాల్పడిన వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
* కార్యక్రమంలో లైంగిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలు, బాధితులపై నేరాల ప్రభావం, సామాజిక బాధ్యత,వ్యక్తిత్వ వికాసం,కోప నియంత్రణ,నైతిక విలువలు, చట్టాలను గౌరవించే జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
* ఈ సందర్భంగా మానసిక వైద్యులు, న్యాయ నిపుణులు మరియు పోలీసు అధికారులు పాల్గొని విలువైన సూచనలు, సలహాలు అందించారు. ప్రతి వ్యక్తి మహిళలు మరియు చిన్నారుల గౌరవం,భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
* “ ఆపరేషన్ పరివర్తన సదన్ ” కార్యక్రమం ద్వారా నేరస్తుల లో సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో శాంతి, భద్రత, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
👉 డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు గారు మాట్లాడుతూ...
* ఈ సందర్భంగా ఎస్.ఓ.ఎస్. (Sexual Offenders Sheets) నమోదైన వ్యక్తులతో నరసరావుపేట డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు గారు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.
* ఆయన మాట్లాడుతూ, గతంలో బాలురు, బాలికలు కలిసి స్వేచ్ఛగా ఆడుకునే వాతావరణం ఉండేదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారుల భద్రతపై ప్రతి కుటుంబం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
* లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతోందని, అరెస్టుల అనంతరం 60 రోజుల లోపు చార్జిషీట్లు దాఖలు చేసి,90 రోజుల లోపు విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వలన ఇలాంటి కేసులు ఏడాది లోపే తుది తీర్పుకు వచ్చే అవకాశాలు పెరిగాయని తెలిపారు.
* అదేవిధంగా, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం మీపై రౌడీషీట్లు కాకుండా ఎస్.ఓ.ఎస్.షీట్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడినట్లయితే రౌడీషీట్లు తెరవబడతాయని హెచ్చరించారు.
* ఒకరికి పడిన శిక్ష సమాజంలోని ఇతరులకు హెచ్చరికగా, మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరిలో సానుకూల పరివర్తన రావాలని,మీలో వచ్చే మార్పు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
* కార్యక్రమం ముగింపు లో హాజరు అయిన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
🔰 ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు గారితో పాటు నరసరావుపేట సీనియర్ న్యాయవాది నజీమా గారు,డాక్టర్ సుస్మిత ఎం.డి
(సైక్రియాటిస్ట్) గారు,RVR కాలేజీ లెక్చరర్ రాజ్యలక్ష్మి గారు, నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ CI సుభాషిని గారు, నరసరావుపేట ఒకటవ పట్టణ CI SK.T. ఫిరోజ్ గారు, నరసరావుపేట రూరల్ CI M.V. సుబ్బారావు గారు, దాచేపల్లి CI M.రాజేష్ గారు మరియుపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.