29/05/2026
“युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः” in our Puja Mandir 🙏..
🕉️ దశమ స్కంధము - ఉత్తర : కృష్ణ సాళ్వ యుద్ధంబు, శ్రీమద్భాగవతం🕉️
సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు.
సకల భూతాలు హాహాకారాలు చేసాయి. అ సమయంలో రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, బాహుబలశాలి సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు.
“ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో..
బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను."
ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు.
అలా శ్రీకృష్ణుడు గదను వేయగా.....
శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయి.
అలా సౌభకంతో సాల్వుడు అదృశ్యమై మాయలు పన్నిన ఆ సమయంలో...
ఒకడు ఆకాశంలో నుండి దుఃఖిస్తూ దిగి వచ్చి, ఆ నందుని నందనుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి "సాల్వుడు మహా ఉగ్రతతో పూని వచ్చి ఆనకదుందుభి అని పిలువబడే వసుదేవుడిని బంధించి తెచ్చాడు.
ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు.
“మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు భావించి...
ఇంకా...
ఇలా అనుకుంటూ మనస్సు వికలం అయి, “దైవనిర్ణయాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యంకాదు కదా.” అని శ్రీకృష్ణుడు దుఃఖంతో బాధపడ్డాడు. ఇంతలో....
ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. పిమ్మట....
ఆ సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో వినయంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన వాడు, జయశీలుడు అయిన ఆయనతో ఇలా పలికారు.
“ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు.
(Source: telugubhagavatam.org)