30/05/2026
*కార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలను అరికడదాం*
* సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
* పార్వతీపురం మున్సిపల్ కార్మికులు జండా ఆవిష్కరణ
దేశ కార్మిక వర్గ హక్కుల సాధన కోసం, శ్రమజీవుల సంక్షేమం కోసం, కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం నిరంతరం సిఐటియు పోరాడుతుందని సిఐటియు నాయకులు అన్నారు. శనివారం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) 56 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమస్త కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పార్వతీపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు, కళాసీ, ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు మాట్లాడుతూ 1970 మే 30న స్థాపించబడిన సిఐటియు, దేశంలోని కార్మిక వర్గానికి అండగా నిలుస్తూ వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలను విజయవంతంగా నడిపిందనీ అన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తోందనీ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ప్రజా రంగ సంస్థల రక్షణ, కార్మికుల జీవన హక్కుల సాధన కోసం మరింత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందనీ కొనియాడారు. నాలుగు లేబర్ అమలు చేస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. పని గంటలు పెంచుతూ వేతనాలు తగ్గిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. కార్పొరేట్ల కోసం కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న బిజెపి విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికులపై ధమనకాండం విధిస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సిఐటియు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ కార్మికులందరూ సంఘటితమై తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పార్వతిపురం కార్యదర్శి సిహెచ్ సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, ఆటో యూనియన్ నాయకులు సింహాచలం కృష్ణ, కళాసి యూనియన్ నాయకులు భానుమూర్తి, జి.కృష్ణ, మున్సిపల్ కార్మికులు రవి, వరదరాజు, శంకర్రావు, ఎం.శివా, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.