10/12/2025
*ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం*
• జిల్లా మహాసభల్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. వెంకటేష్ పిలుపు
• ఎస్ఎఫ్ఐ 33 వ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు హెచ్.సింహాచలం, బి.అనిల్
జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్వతీపురం స్థానిక గిరిజన సామాజిక భవనంలో ఎస్ఎఫ్ఐ 33వ జిల్లా మహాసభ జరిగింది. మొదటగా మహాసభ ప్రారంభ సూచికగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.అఖిల్ సంఘం లక్ష్యాలతో కూడిన ఎస్ఎఫ్ఐ జండాను ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందు, బి.అనిల్, సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వ విద్యా విధానం అత్తలా కుత్తలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గుర్తింపుగా నిలిచిన ప్రాథమిక పాఠశాలలను అనేక సంస్కరణ మార్పులతో నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన 117 జీవోలను రద్దు చేస్తామనే విషయాన్ని విస్మరించడం చాలా అన్యాయం అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు గతం కంటే నేడు మరో రూపంలో దాడికి గురవుతున్నారని పేర్కొన్నారు. సిబ్బంది, తదితరుల వేతనాల పెంపుధలపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా పనిభారాలు పెంచే కుట్రలు చేపడుతుందని, అనేక పని ప్రదేశాలలో రాజకీయ వేధింపులు తాళలేక సిబ్బందులు విధుల నుండి వైదొలగే పరిస్థితులు కనిపిస్తుందని అన్నారు. పిటిఎంల సంబరాలు ప్రభుత్వ పథకాల ప్రచారం కొరకు కాకుండా పాఠశాలల సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కరువైందని, చాలీచాలని గదులతో, సొంత భవనాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పాలవుతున్నారని అన్నారు.
*తీర్మానాలు అమోదం*
పార్వతీపురం, పాలకొండ, గమ్మలక్ష్మీపురం కేంద్రంలో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్ కళాశాలలు నిర్మించాలని, సంక్షేమ హాస్టల్లో రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమించాలని, అన్ని గ్రామాలలో బస్సు సౌకర్యాలు కల్పించాలని పలు తీర్మానాలను ప్రతినిధులందరూ ఆమోదించారు.
*15 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నిక*
ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా అధ్యక్షులు హిమరిక సింహాచలం, జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్, సహాయ కార్యదర్శులు టి.అఖిల్, ఎ.గంగారం, జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ , ఇందుతో పాటు మరో పదకొండు మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.