03/06/2026
మహిళా పోలీస్ స్టేషన్తో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి.
ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
సీసీ కెమెరాల సాంకేతిక వ్యవస్థతో నేర నియంత్రణ మరింత బలోపేతం : ఎమ్మెల్యే విజయ రమణారావు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్,పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో, పెద్దపల్లి పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ విజయ రమణారావు,పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణరావు, నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
పెద్దపల్లి పట్టణం ప్రస్తుతం నిఘానేత్రాల పర్యవేక్షణలో ఉంది. నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ,భద్రతలో భాగంగా గతంలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలకు అదనంగా నేడు మరో 65 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,* పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు అభినందనలు తెలిపారు.పెద్దపల్లి నియోజకవర్గానికి ఒకేసారి నాలుగు పోలీస్ స్టేషన్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో మహిళలపై జరిగే నేరాలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారంలో మహిళా పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కౌన్సెలింగ్ ద్వారా అనేక కుటుంబాలు తిరిగి కలుస్తుండటంతో కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతోందని తెలిపారు.పోలీస్ స్టేషన్లలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.సీసీ కెమెరాలు నేటి సమాజంలో నేరాల నియంత్రణకు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారాయని సీపీ తెలిపారు.జిల్లా కేంద్రంగా ఉన్న పెద్దపల్లిలో ట్రాఫిక్ సమస్యలు,రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు వంటి సంఘటనలను నివారించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరస్థుల కదలికలను గుర్తించడంలో కూడా ఈ నిఘా వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.ప్రతి వ్యాపార సంస్థ,దుకాణం,కాలనీ,నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సీసీ కెమెరాల ఏర్పాటు,సాంకేతిక ప్రమాణాలు, నిర్వహణ తదితర అంశాల్లో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే నిధులతో పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలలో కూడా సీసీ కెమెరాల నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,* సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు,నిర్వహణ విషయంలో పోలీస్ కమిషనర్ చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.గతంలో పట్టణంలో ఏర్పాటు చేసిన అనేక సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్త కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారని తెలిపారు.ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే సమాచారాన్ని పర్యవేక్షించే విధంగా పోలీస్ స్టేషన్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఆధునిక నిఘా వ్యవస్థను అందుబాటులో ఉంచినందుకు పెద్దపల్లి పోలీసులను అభినందించారు.ఇటీవల ఇతర ప్రాంతాల్లో జరిగిన దోపిడీ ఘటనలను ప్రస్తావిస్తూ,ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ చర్యలు హర్షణీయమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.డీసీపీలు, ఏసీపీలు,సీఐలు, ఎస్ఐలు సహా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.పెద్దపల్లి నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తమ అనుభవం,సమర్థ నాయకత్వంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు.క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది నుంచి కమిషనర్ స్థాయి వరకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కమిషనర్,పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్,ఎస్ఐలు లక్ష్మణరావు,నరేష్, ప్రజాప్రతినిధులు, ప్రజలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.