16/07/2024
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు ఫిర్యాదు
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా గెలిచిన తమ ఎమ్మెల్యేలను అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు అడ్డుపడుతుందని మరియు ప్రోటోకాల్ విషయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా అధికారులను ప్రోత్సహిస్తున్నారని, అభివృద్ధి గురించి అడిగితే అధికారుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన నిర్వహిస్తే తనపైనే డిప్యూటీ కమిషనర్ చేత అల్వాల్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టారని, అదేవిధంగా మౌలాలి డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి వెళితే స్థానిక కాంగ్రెస్ గుండాలతో దాడికి యత్నించారని స్పీకర్ గారికి తెలియజేయగా, ఆ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి డిసిపి దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ గారు తెలియజేశారని తెలిపారు.
అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని, బిఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తున్నారని, వీటిన్నింటిపై దృష్టి సారించి పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బృందం కోరిందని తెలిపారు.
స్పీకర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు.