25/09/2025
ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ పరిశీలన
-------------------------------------
చందుర్తి, సెప్టెంబర్ -25
-------------------------------------
స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ కింద జిల్లాలోని ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
ఈ నెల 17 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు కొనసాగనున్న *స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్*లో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో గురువారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించగా, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు వివిధ పరీక్షలు వైద్యులు, సిబ్బంది చేస్తుండగా ఆరా తీశారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రతి రోజూ ప్రత్యేక వైద్య నిపుణులు ఆసుపత్రుల్లో అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద ప్రత్యేక వైద్య నిపుణులతో కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు, రక్తపోటు, డయాబెటిస్, దంత పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, టీబీ పరీక్షలు చేస్తారని, సికిల్ సెల్ ఎనీమియా, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తారని వివరించారు.
రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి కావలసిన మందులు, పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని ఆదేశించారు. మహిళలు శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
శిబిరంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణాల పరిశీలన
వేములవాడ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఆ విద్యాలయంలో టాయిలెట్స్ నిర్మిస్తుండగా, కలెక్టర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.