02/06/2026
శ్రీకాకుళం జిల్లా పోలీసు
ll హెల్మెట్ ప్రాణరక్షణ కవచం – ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి.ll
ll పాతపట్నంలో అభయం హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించిన టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు.ll
శ్రీకాకుళం, పాతపట్నం, జూన్ 02:రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు సూచించారు.జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అమలు చేస్తున్న "అభయం హెల్మెట్ బ్యాంక్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద అభయం హెల్మెట్ బ్యాంకును డీఎస్పీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు అత్యంత అవసరమని పేర్కొన్నారు.ప్రయాణ సమయంలో హెల్మెట్ వెంట లేకపోయినా, హెల్మెట్ బ్యాంక్ ద్వారా ఎటువంటి రుసుం లేకుండా తాత్కాలికంగా హెల్మెట్ తీసుకుని వినియోగించి, అనంతరం స్వంత హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తిరిగి అప్పగించాలని వాహనదారులను కోరారు.ఇంటి నుంచి బయలుదేరిన ప్రతిసారి హెల్మెట్ ధరించే అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, "సేఫ్టీ ఫస్ట్ – హెల్మెట్ మస్ట్" అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు మరియు స్థానిక ప్రజలతో కలిసి హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, పాతపట్నం ఎస్ఐ మధుసూదన్రావు, సర్కిల్ ఎస్ఐలు, డాక్టర్ సంతోష్ బాబు, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police