11/04/2026
మహాత్మా జ్యోతిరావు ఫూలే స్పూర్తితో అంటరానితనం, కులాధిపత్యం, మతచాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు భవిరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరావు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్బంగా శ్రీకాకుళంలో శాంతినగర్ కోలనీలో స్వాతంత్రోద్యమకారుల స్మృతివనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్దరణకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని అన్నారు. నాటి సమాజంలో వెళ్ళూనుతున్న రుగ్మతలపై తన కలాన్ని ఝళిపించి అనేక రచనలు చేశాడు పూలే. కులాధిపత్యం, మతాధిపత్యం, చాందస సంస్కృతిని నిరాకరించడం అనేవి పూలే పెట్టుకున్న ముఖ్య కర్తవ్యాలు. స్వాతంత్రోద్యమంతో పాటు సంఘంసంస్కరణ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లారు. దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు పూలే. కార్మికుల, రైతుల పక్షాన పోరాడే యోజన, కార్యాచరణ పూలేకు ఉన్నాయి. నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదని, "జ్ఞానాన్ని కొన్ని కులాల వాళ్లు మాత్రమే సంపాదించాలి' అనే చాందస సిద్ధాంతాన్ని పూలే తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. సూద్రులు పేరుతో క్రింది కులాలును చదువుకు దూరం చేయడాన్ని వ్యతిరేకించడమే కాకుండా పాఠశాల పెట్టి చదువు చెప్పారని అన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు చదువుకోకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించి 1848 ఆగస్టులో తొలిసారిగా బాలికల కోసం స్వయంగా ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలలో అన్ని కులాల వాళ్లకు ప్రవేశం కల్పించడం వల్ల, అంటరాని వాళ్లకు కూడా బోధించవలసి రావడం వల్ల ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాకపోతే చివరకు తన భార్య సావిత్రి బాయిని పాఠాలు చెప్పారని అన్నారు. తొలిసారి పాఠాలు చెప్పడానికి వెళుతున్న సావిత్రి బాయిని నాటి చాందసవాదులు అనేక రకాలుగా అవమానించినా వాటిని సహనంతో భరించి బాలికలకు విద్య నేర్పిందామె. 1855లో శ్రామికుల కోసం రాత్రి బడి'ని స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ప్రజాసంఘాలు నాయుకులు అల్లు సత్యన్నారాయణ, ఆర్ ప్రకాశరావు, యమ్ గోపి, శ్రీదేవి పానిగ్రాహి, ఎస్.ఎఫ్.ఐ నాయుకులు డి చందు, ఖగేష్, టి ప్రవీణ, ప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.