09/03/2022
కిడ్నీ దానం చేసి కొడుకు ప్రాణాలు కాపాడిన మహిళకు ఘన సన్మానం....
కిడ్నీ మార్పిడి చేస్తేనే కొడుకు ప్రాణాలు దక్కుతాయని సూచించిన వైద్యుల సలహా మేరకు క్షణం ఆలస్యం చేయకుండా తన కిడ్నీని ఇచ్చి ప్రాణాలు కాపాడిన దాతృమూర్తి నెమ్మాది విజయలక్ష్మి అని KVPS జిల్లా కార్యదర్శి కోట గోపి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగురి గోవింద్ లు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆమెకు శాలువా కప్పి, మెమోంటో ఇచ్చి సన్మానం చేయడం జరిగింది.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ప్రజా సేవకే అంకితమై,ప్రజా సమస్యల పరిస్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న సీపీఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు కుమారుడికి కిడ్నీల సమస్య రావడం బాధాకరమని అన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి అనివార్యమని డాక్టర్స్ చెప్పడంతో ఆయన
సతీమణి నెమ్మాది విజయలక్ష్మి తన కుమారుడు క్రాంతి ప్రాణాలను కాపాడటం కోసం ముందుకు వచ్చి కిడ్నీ దానం చేయడం అభినందనీయమని అన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన కిడ్నీ దానం చేసి బంగారు భవిష్యత్తు ఉన్న కుమారుడి జీవితాన్ని నిలబెట్టడం మహిళా లోకానికే గర్వకారణం అని కొనియాడారు.మహిళలు కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నారనడానికి ఇది నిదర్శనమని అన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించాలేనిది ఏది లేదన్నారు.మహిళలు ఇంటితో పాటు సమాజ మార్పు కోసం పాటు పడి సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కిరాణా,ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ,డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జె. నర్సింహారావు,పార్టీ సీనియర్ నాయకులు చెరుకు సత్యం,జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, సిఐటియు నాయకులు మామిడి సుందరయ్య, కొండేటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.