25/06/2026
*హనుమాజీపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యాంటీ-డ్రగ్ అవేర్నెస్ సదస్సు*
*విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు*
*మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలి: డీఎస్పీ*
*పాఠశాల ఆవరణలో భారీ మానవహారం.. డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ*
*ఆకట్టుకున్న పోస్టర్ పెయింటింగ్స్ ప్రదర్శన*
*డ్రగ్స్ సమాచారముంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ 8712671111 కు తెలపండి*
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్ (మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలు) కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ప్రత్యేక ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టాలపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థి లోకంలో విస్తృత చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ విశేష కార్యక్రమానికి వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఏకతాటిపై నిలిచి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకై గట్టిగా యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలను కళ్లకు కడుతూ వినూత్న రీతిలో ప్రదర్శించిన సామాజిక నాటికలు అక్కడికి వచ్చిన వారిని ఎంతగానో ఆలోచింపజేశాయి. అదేవిధంగా డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాలను ఎలా చిదిమేస్తుందో వివరిస్తూ విద్యార్థులు వేసిన పోస్టర్ పెయింటింగ్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఈ అవగాహన సదస్సులో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత దేశానికి అత్యంత కీలకమైన సంపద అని, దేశ ప్రగతి వారి చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న యువత, కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలను అంధకారం చేసుకోవద్దని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి అలవాట్ల వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసిక సమతుల్యత దెబ్బతింటుందని, దీనివల్ల చదువుపై శ్రద్ధ తగ్గి, కెరీర్ నాశనమై చివరికి కన్నతల్లిదండ్రులను, కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చదువుకునే వయసులో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్యాల సాధన కోసమే నిరంతరం శ్రమించాలని అన్నారు.
సమాజంలో ఎదురయ్యే చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లకు లోనై చాలామంది యువకులు ఇటువైపు మళ్లుతున్నారని, కాబట్టి ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా గట్టి మానసిక ధైర్యాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం ఎలాంటి కఠినమైన జైలు శిక్షలు ఉంటాయో, చట్టపరమైన కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎలా కోల్పోతారో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. కేవలం విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా నిరంతరం పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమాజంలో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ నంబర్ 8712671111 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరాజం మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడానికి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు యువత బాగుండాలనే తపనతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, వీటికి ప్రజల నుండి పూర్తి సహకారం అందాలని కోరారు. ఈ విస్తృత అవగాహన సదస్సులో హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకె మధు, ఉప సర్పంచ్ అవునూరి శంకరవ్వ శంకరయ్య, వేములవాడ రూరల్ మండల విద్యాధికారి కిషన్,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ రావు , ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది రాజశేఖర్, సతీష్, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొని పాల్గొన్నారు.