02/06/2026
*ప్రెస్ నోట్-02-06-2026*
*విజయవాడ*
*కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం: గుణదల కొండ ప్రాంత ప్రజల తాగునీటి హక్కుల రక్షణకై నీళ్ల గోతిలో దిగి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ధర్నా*
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని గుణదల కొండ ప్రాంత ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దెవారి పొలాల పరిధిలో ఉన్న అపార్ట్మెంట్లు, భారీ కమర్షియల్ భవనాల ప్రయోజనాల కోసం గుణదల కొండ ప్రాంతానికి చెందాల్సిన తాగునీటిని దొంగిలించి తరలించేందుకు కూటమి ప్రభుత్వం నాయకులు, స్థానిక ఎమ్మెల్యే యత్నించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండ ప్రాంత ప్రజలతో కలిసి భారీ పోరాటానికి దిగారు.
*మంచి నీటిని దొంగిలిస్తున్న కూటమి ప్రభుత్వం*
గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో గుణదల కొండ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని అవినాష్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.
అయితే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుతున్న నీటిని సైతం దొంగిలించి, అక్రమంగా గద్దెవారి పొలాలకు తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కేవలం షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, కుల రాజకీయాలు చేయడంపైనే ఆసక్తి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు.
*పోలీసుల కాపలాతో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’*
గత రెండు రోజులుగా గుణదల కొండ ప్రాంత ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అధికారులను ప్రశ్నించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని అవినాష్ విమర్శించారు. కేవలం షో మాస్టర్ల మాదిరిగా తిరగడం తప్ప ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.
తమ హక్కుల కోసం, తాగునీటి కోసం ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, కూటమి ప్రభుత్వం పోలీసులను కాపలా పెట్టి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తూ బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులు చేస్తామని భయపెట్టే ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగివచ్చిన అధికారులు – రాతపూర్వక హామీ*
గంగిరెద్దుల దిబ్బ, విజయనగర్ కాలనీ, క్రీస్తురాజపురం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు ఉన్న గుణదల కొండ ప్రాంతమంతా నీటి సమస్యతో అల్లాడిపోతున్న నేపథ్యంలో దేవినేని అవినాష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకడుగు వేయకుండా నీళ్ల గోతిలో దిగి సుదీర్ఘ నిరసన చేపట్టారు.
దీంతో అధికారులు స్పందించి గుణదల కొండ ప్రాంత ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, నీటి తరలింపును అడ్డుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఎస్ఈ ద్వారా రాతపూర్వక హామీ పత్రాన్ని అందజేశారు.
*అధికారులకు తుది హెచ్చరిక*
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం కొండ ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు.
“మా ప్రాంత ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, తాగునీటి సమస్య తలెత్తినా గతంలో కంటే తీవ్రస్థాయిలో, నేరుగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతాం” అని హెచ్చరించారు.
ఈ విజయం పూర్తిగా గుణదల కొండ ప్రాంత ప్రజలదేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పోరాట పటిమకు దక్కిన విజయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి మరియు డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.