20/11/2025
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు: భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష, 10,000 రూపాయల జరిమానా.
వికారాబాద్ జిల్లా కోర్టు ఈ రోజు ఒక చారిత్రక తీర్పును వెలువరించింది. 2019 సంవత్సరంలో తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడైన గురు ప్రవీణ్ కుమార్కు మరణశిక్ష (ఉరిశిక్ష),10,000 రూపాయల జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో: అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి) విధిస్తూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్టి వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి గారు వెల్లడించారు.
కేసు వివరాల్లోకి వెళితే, శేరిలింగంపల్లికి చెందిన గురు ప్రవీణ్ కుమార్, చాందినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, చాందినికి అంతకుముందే వివాహం జరిగి ఆయాన్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ, తమ బిడ్డేనని అంగీకరించి ఈ దంపతులు వికారాబాద్కు మకాం మార్చారు. వారికి ఏంజెల్ అనే పాప కూడా జన్మించింది. అయితే, భార్య చాందిని మొబైల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతోందనే అనుమానం గురు ప్రవీణ్ కుమార్కు బలంగా ఉండేది.ఇట్టి విషయంలో చాలా సార్లు గొడవలు జరిగినాయి. అయినాను మారకపోవడం తో భార్య పైన అనుమానం పెంచుకొని ఈ అనుమానం ఎలాగైనా భార్యను చంపాలనే ఉద్దేశం తో 04.08.2019రోజు రాత్రి పిల్లలు నిద్రించిన తర్వాత కోపంతో తన భార్య చాందినిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం, ఆయనే ఇద్దరు పిల్లలైన ఆయాన్ (బాబు) ను రాడ్డు తో కొట్టి, ఏంజెల్(పాప)ను గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు.
ముగ్గురిని హత్య చేసిన తర్వాత నిందితుడు గురు ప్రవీణ్ కుమార్ తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైలు పట్టాలవైపు వెళుతున్నాడు. మార్గమధ్యలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ కనిపించగా, తాను చేసిన నేరాన్ని చెప్పి వెళ్దామని స్టేషన్కు వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని, నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించిన తర్వాత మొదటి ఐఓ అప్పటి టౌన్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్ రావు గారు తక్షణమే క్రైమ్ నెంబర్ 247/2019, సెక్షన్ 302 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం 2వ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ పి. సీతారాం గారు, 3వ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ ఏ. సంజీవ రావు గారు కేసును పటిష్టంగా, లోపాలు లేకుండా దర్యాప్తు పూర్తి చేశారు. దర్యాప్తు పత్రాలు, సాక్ష్యాలను కోర్టులో సమర్పించగా, వాదోపవాదాలు విన్న గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకొని నిందితుడు ప్రవీణ్ కుమార్కు ఉరిశిక్ష మరియి10,000 రూపాయల జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో: అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి) విధిస్తూ ఈరోజు చారిత్రక తీర్పును ప్రకటించారు.
ఈ కేసులో నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పి. సుధాకర్ రెడ్డిని, ఐఓలు: అప్పటి ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్ రావు, అప్పటి డీఎస్పీలు పి. సీతారాం, ఏ. సంజీవ రావు, ప్రస్తుత అధికారులు అయిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్,బ్రీఫింగ్ ఆఫీసర్ గిరన్న, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎల్. నరేందర్, లైసానింగ్ ఆఫీసర్ యస్. శ్రీనివాస్ (ఎస్ఐ), ) ఇ. చంద్ర శేఖర్ (ఏఎస్ఐ) జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.