28/07/2023
గోదావరి మహా సమాఖ్య
21000 మహిళా మత్స్యకారుల సమూహం
ఒక సామాజిక, ఆర్థిక చైతన్యం!
తూర్పు గోదావరి జిల్లా గోదావరి మహా సమాఖ్య ( జీ ఎం ఎస్ ) సమిష్టి కృషికి గొప్ప ఉదాహరణ. 2007 లో ఈ జిల్లా సమాఖ్య ఏర్పడింది. తాళ్ళ రేవు దగ్గర ప్రధాన కేంద్రం. 27 కిలోమీటర్లు కాకినాడ నుండి.
పేద మత్స్య కారులతో సుమారు 1750 మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి.
వీటి పైన గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా స్థాయిలో గోదావరి మహా సమాఖ్య పేరుతో ఏర్పడ్డాయి.
అభ్యుదయ కుమార్ కి ఎన్నో రోజులుగా కోరిక వారిని కలవలనీ, వారి కార్యక్రమాలు చూడాలనీ.
స్థానిక ఫిషరీస్ అధికారులు రాజు, వీ వీ రావు కూడా కలసి వెళ్ళారు.
అందరూ కలసి అమీనాబాద్ ఫిష్ లాండింగ్ సెంటర్ కి వెళ్ళారు ప్రత్యక్షంగా చూడాలని. వందలాది చేపల పడవలు, ఎంతో మంది మహిళలు, పురుషులు.. ప్రదేశం అంతా కోలాహలంగా ఉంది. ఎందరో మహిళలు ఇక్కడ చేపలు కొనుగోలు చేసి గ్రామాలలో అమ్మటానికి వెళ్తారు వారి జీవనం కోసం.
ఇక్కడ కూడా ఒక తాజ్ మహల్ లాంటి పెద్ద భవనం కనిపించింది. ఇది సమాఖ్య ముఖ్య కార్యాలయం. కోటీ ఇరవై లక్షల ఖర్చుతో కట్టారట. ఇది కొంచెం మింగుడు పడని విషయం! ఇలాంటి భవనాలకి తక్కువ ఖర్చు చేస్తే సాధారణ సభ్యులకి ఆదాయం పెంచే పనులకి, అవసరాలకి డబ్బులు ఉంటాయి కదా.
మహిళా సంఘాలు ఏర్పడ్డాక వారిలో చాలా ఉత్సాహం, చైతన్యం, అభివృద్ధి వచ్చాయి. ఇది నిస్సందేహం.
ఎక్కువ భాగం మహిళలు సముద్రపు రేవుల నుండి, పెద్ద మార్కెట్ల నుండి చేపలు కొని ఊరూరూ తిరిగి, అమ్మి ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తారు.
కొందరు వీరిలో ఫిష్ పచ్చళ్ళు చేసి అమ్ముతారు. రొయ్య అవకాయ కూడా! చాలా డిమాండ్ ఉందని చెప్పారు.
ఈ మహిళలతో మాట్లాడితే ఎంతో ఆనందం వేస్తుంది. తమ సంఘాల నుండి, బ్యాంక్ నుండి అప్పు తీసుకుని తమ బిజినెస్ అభివృద్ధి చేసుకున్న వారెందరో! ఎన్నో ప్రేరణ కలిగించే జీవన గాథలు మనం చూడవచ్చు ప్రత్యక్షంగా.
అన్ని స్థాయిల్లో కలిపి తమ సొంత నిధులు పది కోట్ల రూపాయల రుణాలు సభ్యులకి ఇచ్చారంటే స్కేల్ మనకి అర్థం అవుతుంది.
అలాగే బ్యాంకుల నుండి సభ్యులు తీసుకున్న రుణాలు సుమారు 35 కోట్ల రూపాయలు.
వారి సమస్యలు విస్తారంగా అభ్యుదయ కుమార్, అతని సహచరులు తెలుసుకున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ పెద్ద సమస్య. బస్సులలో రానివ్వరు. చిన్న ట్రక్కుల వంటి వాహనాలు వెతుక్కుని తెచ్చుకోవాలి. ఊరు ఊరు వెళ్ళాలి. తిరిగి ఇంటికి చేరుకోవాలి. ఈ ప్రాసెస్ లో బోలెడు టైం నష్టం అవుతుంది వారికి.
అభయ కుమార్ ట్రాన్స్ పోర్ట్ కోసం మహిళలు ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్క వెయ్యమన్నారు. ఎంత మంది మహిళలు, ఎన్ని రోజులు, నెలకి, సంవత్సరానికి ఎంత డబ్బు సుమారుగా ఖర్చు పెడుతున్నారో లెక్క చూసారు. అందరికీ ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగిన విషయాలు తెలిసాయి.
సుమారు పది కోట్ల రూపాయలు వారందరూ కేవలం రవాణా ఖర్చుకి వెచ్చిస్తున్నారు! ఆ డబ్బుతో వారే వాహనాలు కొనుక్కోవచ్చు, నడప వచ్చు! ఇంతకు ముందు ఎప్పుడూ వారు ఇలా లెక్కలు వెయ్యలేదు మరి.
మరి ఏమిటీ ఉపాయం? దీర్ఘ చర్చల తర్వాత చేయవలసిన ప్లాన్లు నిర్ణయించుకున్నారు.
మహిళల ముఖ్యమైన బిజినెస్ రూట్లు గుర్తించారు. ఆ రూట్లలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో కేవలం సభ్యుల సౌకర్యం కోసం వాహనాలు నడపాలని ప్లాన్ చేసారు. రేవు నుండి ఊర్ల మీదుగా వారి గ్రామాల వరకూ ఏడు రూట్లు తయారు చేసారు. దీనికోసం అభయ కుమార్ ఫిషరీస్ బోర్డ్ నుండి ఏడు వాహనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆ రోజు వచ్చింది. వాహనాలు వారికి అందాయి. జీ ఎం ఎస్ ఏడు రూట్లు తయారు చేసి ఆయా దారుల్లో ఉండే మహిళలు ఎంతో సౌకర్యంగా చేపలు కొని, గ్రామాల్లో అమ్మి, ఇంటికి తిరిగి వచ్చే ఏర్పాటు చేసారు. వారందరికీ చాలా సమయం వృధా కాకుండా కలసి వచ్చింది. సమయం మీద, తమ జీవితాలలో కూడా నియంత్రణ వచ్చింది!
చేపలు కూడా క్వాలిటీ తగ్గకుండా కస్టమర్స్ కి ఇవ్వ గలుగుతున్నారు.
అభయ్ కుమార్ జీ ఎం ఎస్ ప్రతినిధులను హైదరాబాద్ ఆహ్వానించారు ఫిషరీస్ బోర్డ్ ఆఫీస్ కి. ఫిష్ క్వాలిటీ ఎక్కువ కాలం ఉండాలంటే ఐస్ కానీ, ఫ్రీజింగ్ కానీ అవసరం. వీరి సభ్యులలో చాలా మంది మహిళలు ఎండు చేపలు అమ్ముతూ ఉంటారు ఆదాయ మార్గం కోసం. దుమ్ము, ఇసుక పడకుండా క్వాలిటీ వస్తువు అమ్మటానికి వారికి డ్రై యర్లు అవసరం.
అదే విషయం మహిళలు చెప్పారు. వారి అవసరాల ప్రకారం సోలార్ ఫ్రిజ్ లు, డ్రైయర్లు వారికి అంద చేసారు. జీ ఎం ఎస్ తమ బ్రాండ్ డెవలప్ చేసి వారి ఉత్పాదనలు అమ్మితే బావుంటుంది.
గోదావరి మహా సమాఖ్య ఒక అభివృద్ధి యాగం అనవచ్చు. ఎన్నో సంవత్సరాల కృషితో వేలాది మహిళలు, వారి కుటుంబాలు ముందుకు వెళ్తున్నారు. వారి పిల్లలు పెద్ద చదువులు చదివి ఎన్నో ప్రదేశాలలో, ఫీల్డ్స్ లో ప్రతిభ చూపిస్తున్నారు.
అభయ్ కుమార్ కి అనిపిస్తుంది ఇంతమంది మహిళలు కలిస్తే, చేయలేనిది ఏదీ లేదనీ, ఇంకా ఎంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందనీ.
దేశంలోనే ఒక మంచి ఉదాహరణ గోదావరి మహా సమాఖ్య, వారి వేలాది మహిళా సభ్యుల విజయ యాత్ర, కథ!