05/09/2026
ఈరోజు 05-09-2026 శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారి పత్రిక విలేఖరుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా లంకా దినకర్ గారు మాట్లాడుతూ 7.8% అధికారిక జీడీపీ వృద్ధిని 2.6%గా చూపేందుకు పాత 2011–12 జీడీపీ శ్రేణిని కొత్త 2022–23 శ్రేణితో కలపడం ఆర్థిక విశ్లేషణ కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ దుష్ప్రచారం అని, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మద్దతుదారులు, వామపక్ష సానుభూతిపరులు, అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వారు జీడీపీ గణాంకాల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఒకే జీడీపీ శ్రేణి, ఒకే ఆధార సంవత్సరం, ఒకే పద్ధతి, పోల్చదగిన ధరల ప్రాతిపదిక ఆధారంగానే వృద్ధిని లెక్కించాలి. 2025–26 గణాంకాలను 2011–12 శ్రేణి నుంచి, 2026–27 గణాంకాలను 2022–23 శ్రేణి నుంచి తీసుకుని, వాటి మధ్య వచ్చిన తేడాను “వాస్తవ జీడీపీ వృద్ధి”గా చూపడం శాస్త్రీయంగా చెల్లుబాటు కాదని అన్నారు. 2022–23ను కొత్త ఆధార సంవత్సరంగా ఎంచుకోవడం రాజకీయ నిర్ణయం కాదని, జాతీయ ఖాతాల గణాంకాల సలహా కమిటీ వివిధ సంవత్సరాలను పరిశీలించిన అనంతరం ఈ సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు. జీఎస్టీ అమలు, కోవిడ్-19 ప్రభావం, కోవిడ్ అనంతర అసాధారణ పునరుద్ధరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 2022–23ను సాపేక్షంగా సాధారణ సంవత్సరంగా పరిగణించారని పేర్కొన్నారు.
2011–12 నాటి భారత ఆర్థిక వ్యవస్థకు, 2026 నాటి భారత ఆర్థిక వ్యవస్థకు మధ్య గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఈ-కామర్స్, ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యాపారాల అధికారికీకరణ వంటి రంగాల్లో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ విమర్శించవచ్చని, అది వారి ప్రజాస్వామ్య హక్కు. కానీ రాజకీయ వ్యతిరేకతకు అనుగుణంగా గణాంకాల ప్రమాణాలను మార్చడం మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
2.6% వృద్ధి వాదన నిజమని కాంగ్రెస్, వామపక్షాలు భావిస్తే, పూర్తి గణాంకాలు, పద్ధతి, ఆధారాలు, లెక్కింపులను ప్రజల ముందుంచాలి అని లంకా దినకర్ సవాల్ చేశారు. వికసిత్ భారత్ 2047కు విశ్వసనీయ సమాచారం అవసరమని, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కు విశ్వసనీయ కొలమానం అవసరం అని, విశ్వసనీయ గణాంకాలకు మేధోపరమైన నిజాయితీ అవసరమని అన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. K సుహాసిని ఆనంద్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ KNP చక్రవర్తి, కరణంరెడ్డి నరసింగరావు, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి పొలిమేర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.