10/09/2025
విజయనగరం... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా యూరియా కొరత, పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించకపోవడం వంటి అంశాలపై నిరసిస్తూ మంగళవారం తలపెట్టిన *అన్నదాత పోరు* కార్యక్రమం విజయనగరం నియోజకవర్గంలో విజయవంతంగా జరిగింది. జ్యోతిరావు పూలే విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఆర్డిఓ ఆఫీస్ వరకు విజయనగరం, నెల్లిమర్ల, ఎస్ కోట నియోజకవర్గాల నాయకులతో కలిసి నిరసన ర్యాలీని చేపట్టిన అనంతరం ఆర్టీవో కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ర్యాలీలో పాల్గొన్న నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బొడికొండ అప్పలనాయుడు, ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ లు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని,యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వామే బాధ్యత వహించాలని మరోవైపు ఉల్లి, మినుము పంటల ధరలు పతనమై రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని అతివృష్టి, అనావృష్టి కాలంలో ఇబ్బంది పడే రైతు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం పడరానీ పాట్లు పడుతున్నారని ఆయన అన్నారు. సీజన్లో పొలం పనులు మానుకొని రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం కష్టంగా మారిందని, యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా యూరియా కొరతే కాకుండా పండిన పంటల తగిన ధర కల్పించలేకపోవటం, ఉల్లి, మామిడి, నిమ్మ పంటలు దిగుబడి తగ్గి పంటను రోడ్డు పాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు. వైసిపి హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రైత భరోసాలు ఏర్పాటుచేసి తద్వారా రైతన్నలకు ఎరువులు, యూరియా పంపిణీ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి, అవగాహన సదస్సులు కూడా కల్పించేవారని ప్రజలకు గుర్తు చేశారు. రైతన్నకు అండగా వైసిపి ప్రభుత్వం ఉంటుందని, మూడు నియోజకవర్గాల నాయకులు విజయనగరంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో వినతి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆశపు వేణు, ఉప అధ్యక్షులు ఎస్ వి వి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రెడ్డి బంగారు నాడు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మండల అధ్యక్షులు కెల్ల త్రినాధరావు, తో పాటు మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.