23/04/2024
సీఎం రేవంత్ రెడ్డి గారి ఔన్నత్యానికి హేట్సాఫ్
- తూళ్ల విజయేందర్ గౌడ్
మంచిని మంచిగా చెప్పడం, మంచి చేసిన మహానుభావులను తలుచుకొని వారుచేసిన మంచిని గుర్తు చేయడం సామాన్యమైన విషయం కాదు. అలా చెప్పడానికి సంస్కారం కావాలి. అందులోనూ సొంత పార్టీ కాని వారు చేసిన గొప్ప పనుల్ని ప్రస్తుతించాలంటే గుండెల నిండుగా ధైర్యం, ఔన్నత్యం ఉండాలి. ఔదార్యం కావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆయనొక ప్రత్యేకమైన నాయకుడుగా ప్రజల ఆదరాభిమానాల్ని, ప్రేమను పొందగలుగుతున్నారు. దీనిని ప్రతి యువనేత నేర్చుకోవాలి, అనుసరించాలి. ఇక అసలు విషయంలోకి వెళితే..
మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ *‘‘ఈయాళ నేనొక విషయం చెప్పదల్చుకొన్నా, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలిచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సిసిరోడ్లు వేయించి పెద్దలు దేవేందర్ గౌడ్ గారు అభివృద్ధి చేశారు. ఆయన చేసిన అభివృద్ధే ఇప్పటికీ జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలల్ల ఇళ్ల పట్లాలొచ్చినయ్. మరి గత పదేళ్లల్లో బీఆర్ఎస్ ఇచ్చిన ఇళ్ల పట్టాలేమిటో, చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి అంచనా వేసుకోండి’’* అంటూ శ్రీ దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల నుంచి వచ్చి బస్తీల్లో ఉన్న వేలాది మందికి ఇళ్ల పట్టాలిచ్చిన విషయాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో ప్రస్తావించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ తమకంటే ముందున్న పాలకులు చేసిన మంచి పనుల్ని కనీసం ప్రస్తావించిన సందర్భం లేదు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాదు.. గత అసెంబ్లీ సమావేశాలలో సైతం మాట్లాడుతూ *‘‘శ్రీ దేవేందర్ గౌడ్ గారు 2008లో ఆదిలాబాద్ నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటూ ప్రాణహిత-చేవెళ్ల నిర్మించాలని చెప్పి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఆరోజు ప్రారంభించడం జరిగింది’’* అంటూ తెలంగాణ చరిత్రలో ఓ కీలక అధ్యాయమైన శ్రీ దేవేందర్ గౌడ్ గారు చేసిన గోదావరి జలసాధన యాత్రను ప్రస్తావించి.. చరిత్రను గుర్తు చేశారు.
గత 10 ఏళ్లల్లో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు అనేకం జరిగాయి. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని, తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసిన వారిని మరుగున పరిచే సంకుచితమైన ఆలోచనలు, పనులు జరిగాయి.
కానీ.. నేడు శ్రీ రేవంత్ రెడ్డి గారు.. గతంలో ఏం జరిగిందో నిజాలు చెబుతున్నారు. పార్టీలకతీతంగా ఆలోచిస్తున్నారు. మాట్లాడుతున్నారు.
హేట్సాఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు!
థ్యాంక్యూ..